బీహార్ ఎన్నికల ఫలితాలపై ఈసీ అధికారిక ప్రకటన... ఇప్పటివరకూ 223 స్థానాల్లో తేలిన ఫలితం...
బీహార్లో ఇప్పటివరకూ 223 స్థానాల్లో ఫలితం తేలినట్లు ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. మరో 20 స్థానాల్లో ఇంకా తుది ఫలితం తేలాల్సి ఉందని పేర్కొంది. ఇందులో 17 స్థానాల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతోందని.... మరో 3 స్థానాల్లో వీవీపాట్స్ లెక్కింపు కొనసాగుతోందని వెల్లడించింది. పూర్తి ఫలితాలు మరో గంటలో వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం... ఇప్పటివరకూ ఎన్డీయే 114 స్థానాల్లో గెలుపొందగా మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇందులో బీజేపీ 66 స్థానాలు గెలుచుకోగా... 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే జేడీయూ 40 స్థానాలను గెలుచుకోగా 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇక బీహార్లో 71 సీట్లతో ఆర్జేడీ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆర్జేడీ నేత్రుత్వంలోని మహాకూటమి ఇప్పటివరకూ 104 స్థానాల్లో గెలుపొందగా... మరో ఆరు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఆరు స్థానాల్లో గెలిచినా ఆర్జేడీ మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేదు. మరోవైపు బీజేపీ ఇప్పటికే తాము గెలిచేశామని ప్రకటించుకుంది. బీహార్ ప్రజలు అభివృద్దికే పట్టం కట్టారని పేర్కొంది.
ఇక బీహార్ ఎన్నికల్లో తొలిసారిగా ఎంఐఎం పార్టీ 5 స్థానాల్లో గెలవడం విశేషం. బీఎస్పీ ఒక స్థానంలో ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలిచారు. ఇక లోక్ జనశక్తి పార్టీ దాదాపు 143 స్థానాల్లో పోటీ చేయగా... కేవలం ఒకచోట మాత్రమే గెలుపొందింది.
Recommended Video
మరోవైపు ఓట్ల లెక్కింపుపై ఆర్జేడీ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ అభ్యర్థులు గెలిచిన దాదాపు 10 చోట్ల ఎన్నికల కమిషన్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా జాప్యం చేస్తోందని ఆరోపించింది. ఓట్ల లెక్కింపులో నితీశ్ డైరెక్షన్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించింది.జిల్లా అధికార యంత్రాంగం,ఎన్నికల అధికారులపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఎన్నికల ఫలితాల్లో సీఎం మోదీ,బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ కుట్రలకు తెరలేపారని మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఈసీపై తమకు నమ్మకం ఉందని... అయితే అధికార యంత్రాంగంపై మాత్రం నమ్మకం లేదని ఆర్జేడీ నేత మనోజ్ ఝా అన్నారు. ఆర్జేడీ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేదని స్పష్టం చేసింది.