కరోనా వ్యాక్సిన్ ఫలితాలు ఆశాజనకం- టీకా ఉత్పత్తిలో భారతే కీలకం- ఐసీఎంఆర్ ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి విరుగుడుగా పనిచేసే టీకాను కనిపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకాతో పాటు ఆక్స్ఫర్డ్ పిఫివిర్, రెమిడెజివిర్ వంటి టీకాలను ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో, దశల్లో పరీక్షిస్తున్నారు. వీటిలో ఏ ఒక్కటి విజయవంతమైనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల చూపూ వాటి మీద పడే అవకాశాలుంటాయి. దీంతో భారత్లో జరుగుతున్న టీకా ప్రయోగాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇందుకు తగినట్లుగానే ఐసీఎంఆర్ కూడా తాజాగా స్పందించింది.
త్వరలో కరోనా వ్యాక్సిన్ ఖాయం..
భారత్లో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం జరుగుతున్న ప్రయోగాలను ఐసీఎంఆర్ నిశితంగా గమనిస్తోంది. వీటిలో ఏదో ఒక ప్రయోగం విజయవంతమైనా వచ్చే మూడు, నాలుగు నెలల్లో టీకా అందుబాటులోకి రావడం ఖాయమని ఐసీఎంఆర్ అంచనా వేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపుతోంది. దీంతో కేంద్రం కూడా వచ్చే మూడు నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందని ధైర్యంగా ప్రకటనలు చేస్తోంది. ప్రస్తుతం భారత్లో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ యొక్క ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ఐసీఎంఆర్ తాజాగా ప్రకటించింది. ఐసీఎంఆర్ న్యూస్ లెటర్ ఈ-సంవాద్ ఎడిటోరియల్లో ఈ మేరకు ఐసీఎంఆర్ చేసిన ప్రకటన భారత్లో కోట్లాది మంది కరోనా రోగులకు ఊరటనిచ్చేలా ఉంది.
వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారతే కీలకం...
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నా భారత్లో జరుగుతున్న ప్రయోగాలు ప్రత్యేకమైనవని ఐసీఎంఆర్ తాజాగా పేర్కొంది. ఇందుకోసం భారత్లో పూర్తిస్దాయిలో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ఊపందుకోవాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ తెలిపింది. కరోనా ప్రభావం మొదలైన నాటి నుంచి పలు దేశాల్లో వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నా.. భారత్లో మాత్రం ఈ వ్యాక్సిన్కు సంబంధించి జరుగుతున్న ప్రయోగాల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ఐసీఎంఆర్ చెబుతోంది. ఈ లెక్కన చూస్తే భారత్ లో కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది.
Recommended Video
ఉమ్మడి ప్రయోగాలతోనే ఫలితం...
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రయోగాల మధ్య సమన్వయం అవసరమని ఐసీఎంఆర్ తన తాజా ఎడిటోరియల్లో అభిప్రాయపడింది. ఉమ్మడిగా మాత్రమే ఈ మహమ్మారిని ఎదుర్కొనగలమని పేర్కొంది. ప్రస్తుతం భారత్లో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో భారత్ బయోటెక్ సాగిస్తున్న ప్రయోగాలు మూడో దశలో ఉన్నాయని ఐసీఎంఆర్ తెలిపింది. జైడులాతో పాటు సీరం ఇన్స్టిట్యూట్, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రయోగాల ఫలితాలు కూడా ఆశాజనకంగా కనిపిస్తున్నాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. భారత్తో పాటు అంతర్జాతీయంగా 44 వ్యాక్సిన్ ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయని వివరించింది. ఇందులో భారత్ కీలక పాత్ర పోషించబోతోందని తెలిపింది.