Crime News:భార్యను 300 ముక్కలుగా కోసేసిన డాక్టర్... కోర్టు విధించిన శిక్ష ఏంటో తెలుసా..?
క్షణికావేశంలో చేసే పనులకు జీవితాంతం జైలులో మగ్గాల్సిన పరిస్థితి వస్తోంది. ఆ ఒక్క క్షణం ఆలోచన చేసి ఉంటే బతుకు మరోలా ఉండేది. కానీ కోపాన్ని నిగ్రహించుకోలేక ఆ క్షణంలో హత్య చేసి జీవితాలను చాలామంది నాశనం చేసుకుంటున్నారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారు కూడా ఘోర నేరాలకు పాల్పడుతూ జైలులో మగ్గుతున్నారు. ఇలాంటిదే ఓ ఘటన 2013లో జరుగగా మంగళవారం కోర్టు తీర్పు ఇచ్చింది.
శరీరాన్ని 300 ముక్కలుగా కోసిన డాక్టర్
రిటైర్ అయిన ఆర్మీ డాక్టర్ 2013లో తన భార్యను హత్యచేశాడు. ఆమె శరీరంను 300 ముక్కలుగా కోసేశాడు. ఈ ఘటన భువనేశ్వర్లో జరిగింది. 2013లో జరిగిన ఈ హత్యకు సంబంధించి దాదాపు ఆరేళ్ల తర్వాత జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. సోమనాథ్ పరిదా అనే 78 ఏళ్ల రిటైర్డ్ ఆర్మీ డాక్టర్ తన భార్యను 2013లో హత్య చేశాడు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసేశాడు. పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన కేసులో చివరకు తీర్పు వచ్చింది. ఖుర్దా జిల్లా సెషన్స్ కోర్టు లోక్నాథ్ మహోపాత్ర నిందితుడైన ఆర్మీ డాక్టర్కు శిక్ష ఖరారు చేసినట్లు ప్రభుత్వ లాయర్ ఆర్ఆర్ బర్హ్మా చెప్పారు.
పరిసరాలను పరిగణలోకి తీసుకుని తీర్పు
అయితే నిందితుడు సోమనాథ్ పరిదా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షులకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని అయితే హత్య సమయంలో అక్కడి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వాటినే ఆధారంగా చేసుకుని జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి లోక్నాథ్ మహోపాత్ర తీర్పు ఇవ్వడంతో పాటు శిక్ష ఖరారు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్లీడర్ చెప్పారు. సోమనాథ్కు జీవితఖైదు విధించడం జరిగిందని లాయరు వెల్లడించారు. 2013 జూన్ 3న తన 62 ఏళ్ల భార్యను హత్యచేసి శరీరంను ముక్కలు ముక్కలుగా కోశాడని లాయర్ వెల్లడించారు. జూన్ 21న సోమనాథ్ను నయాపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.
హత్య ఎలా వెలుగులోకి వచ్చింది..?
హత్య జరిగిన 15 రోజులకు ఈ విషయం వెలుగు చూసిందని లాయర్ చెప్పారు. విదేశాల్లో ఉంటున్న నిందితుడి కూతురు తన తల్లితో మాట్లాడేందుకు ఫోన్ చేస్తుండగా ఫోన్ తీయకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చిందని లాయర్ చెప్పారు. ఇక నిందితుడైన సోమనాథ్కు ఫోన్ చేసి తల్లికి ఫోన్ ఇవ్వాల్సిందిగా కోరగా తను ఇవ్వలేదని దీంతో తన తల్లికి ఏదో ప్రమాదం జరిగిందని తాను ఊహించి తన సమీప బంధువును ఇంటికి పంపినట్లు లాయర్ చెప్పారు. ఇంటికి చేరుకున్న బంధువు... సోమనాథ్ భార్య కనిపించకపోవడంతో హత్యకు గురై ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లాయర్ చెప్పారు.
Recommended Video
రెండు డబ్బాలో మృతదేహం ముక్కలు
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడి ఇంటికి చేరుకున్నారు. అక్కడ పరిసరాలను పరిశీలించగా సోమనాథ్ తన భార్యను హత్య చేసి ఉంటాడనే నిర్థారణకు వచ్చారు. వెంటనే ఇంట్లో సోదాలు నిర్వహించారు. మృతదేహంను ముక్కలు ముక్కలుగా కోసి స్టీలుడబ్బాలో ప్యాక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఒక కత్తి, రెండు కట్టర్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.ఇదిలా ఉంటే తన భార్యను తాను చంపలేదని తాను నిరపరాధినంటూ కోర్టు బయట కేకలు వేశాడు ఆర్మీ డాక్టర్ సోమనాథ్.