మధ్యవర్తిత్వం కాదు సహకారం మాత్రమే అందిస్తాం.. కాశ్మీర్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికా దిద్దుబాటు
వాషింగ్టన్ డీసీ : కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం భారత్, పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ట్రంప్ చేసిన కామెంట్లపై భారత్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కాశ్మీర్ అంశం పూర్తిగా ద్వైపాక్షిక సమస్య అని చెప్పింది. ఈ సమస్యను ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటే అమెరికా సాయం అందిస్తుందని స్పష్టం చేసింది.
కశ్మీర్ ఇష్యూ : ట్రంప్పై భారత్ గుస్సా, మధ్యవర్తిత్వం వహించమని కోరలేదని వెల్లడి
మాట మార్చిన అమెరికా
తాజా ప్రకటనపై కాశ్మీర్పై అమెరికా వైఖరి మార్చుకోబోతోందా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన అధికార ప్రతినిధి కేవలం అగ్రరాజ్యం సహకారం మాత్రమే అందిస్తుదని చెప్పారు. ఉగ్రవాదంపై పాక్ తీసుకునే చర్యల ఆధారంగానే ద్వైపాక్షిక చర్చలకు మార్గం సుగమం అవుతుందని అభిప్రాయప్డాడరు. ఈ అంశంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హామీ ఇచ్చారని, ఉగ్రవాదం విషయంలో అంతర్జాతీయ సమాజం సైతం ఆ దేశంపై ఆంక్షలు విధించిందని చెప్పారు. భారత్ - పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు అవసరమైన సాయం అందించేందుకు అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్ఫష్టం చేశారు.
ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించిన భారత్
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్ కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిగా వ్యవహరించేందకు సిద్ధమని ప్రకటించారు. మోడీ ఈ అంశంపై తనతో చర్చించారని చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్ వ్యాఖ్యల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని, ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరంలేదని తేల్చిచెప్పింది.
మోడీ స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాల డిమాండ్
మోడీ తనతో కాశ్మీర్ అంశాన్ని చర్చించారన్న ట్రంప్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. దీనిపై మోడీ నోరు మెదపాలని, తాను ఏం మాట్లాడారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. ట్రంప్తో జరిగిన సమావేశంలో మోడీ కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వంపై ఎలాంటి చర్చ జరపలేదని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టంచేశారు.