100 శాతం సీటింగ్ కెపాసిటీ వద్దు.. తమిళనాడు సర్కార్కు హోం శాఖ స్పష్టీకరణ
కరోనా వైరస్ జడలు విప్పి నాట్యం చేస్తోంది. ఇటు కరోనా స్ట్రెయిన్ టెన్షన్ కూడా ఉంది. అయితే సినిమా హాళ్లకు కేంద్ర హోం శాఖ నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. 50 శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు నడుపుకోవాలని స్పష్టచేసింది. అయితే ఒకడుగు ముందుకేసిన తమిళనాడు ప్రభుత్వం.. 100 శాతం సీట్లతో థియేటర్లు నడిపిస్తామని స్పష్టంచేసింది. దీనిని హోం శాఖ తీవ్రంగా పరిగణించింది.
Recommended Video
100 శాతం సీట్ల సామర్థ్యం నుంచి తిరిగి 50 శాతం సీట్లకు కుదించాలని స్పష్టంచేసింది. హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్రాలు/ కేంద్ర ప్రాంత పాలిత రాష్ట్రాలు పాటించాలని తేల్చిచెప్పింది. గతనెల 28వ తేదీన జారీచేసిన మార్గదర్శకాలను వెనక్కి తీసుకోవాలని కోరింది. నవంబర్ 10వ తేదీ నుంచి 50 శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు తెరిచారు.
థియేటర్లలో భౌతిక దూరం పాటిస్తూ.. నడుస్తున్నాయి. అయితే జనవరి 4వ తేదీ నుంచి సీట్ల సామర్థ్యాన్ని పెంచాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. థియేటర్లు, మల్టీప్లెక్స్ల్లో 100 శాతం అనుమతి ఇవ్వాలని స్పష్టంచేసింది. థియేటర్ల ఓనర్లు కోరడంతో ఈ మేరకు తమిళనాడు డిజాస్టర్ మేనేజ్ మెంట్ డిపార్ట్ మెంట్ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వల్ల థియేటర్లు మూతపడగా.. ఓటీటీ ప్లాట్ ఫామ్పై సినిమాలను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.