ఆర్టికల్ 370 రద్దుకు ఓకే...ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్
జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాజ్య సభలో చర్చ జరుగుతుండగానే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక సభలో కొన్ని పార్టీలు ప్రతిపాదనను వ్యతిరేకించగా మెజార్టీ పార్టీలు మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాయి. జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రానికి భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు ఎదురుకాబోతున్నాయి..?
జమ్ము కశ్మీర్ పై కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం
ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు, వేల కంపెనీల బలగాలను జమ్ము కశ్మీర్లో కేంద్రం ప్రభుత్వం మోహరించి ఆపై చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం గత పదిరోజులుగా చాలా సీరియస్గా వర్కౌట్ చేసింది ప్రభుత్వం. గతవారం జమ్మూకశ్మీర్లో పర్యటించిన అజిత్ దోవల్ అక్కడి పరిస్థితిని సమీక్షించి తిరిగి ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఢిల్లీలో ల్యాండ్ అవగానే జమ్ముకశ్మీర్లో 10వేల కంపెనీల పారామిలటరీ బలగాలు మోహరించాయి. దీంతో కశ్మీర్లో ఏదో జరుగుతోందన్న నిర్ణయానికి దేశం వచ్చేసింది. ఆ తర్వాత అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదులు దాడి చేస్తారనే సమాచారం ఉందంటూ అక్కడి యాత్రికులను ముందస్తుగానే ఖాళీ చేయించడం, రాష్ట్రాన్ని పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకోవడం వంటి క్రమంను చూస్తే ఆర్టికల్ 370 రద్దు కోసమే ఇదంతా చేసినట్లు చర్చ జరుగుతోంది.
మిగతా రాష్ట్రాల్లో అమలవుతున్న కేంద్ర చట్టాలు జమ్ముకశ్మీర్లో అమలవుతాయా..?
ఇక రాజ్యసభలో కేంద్రహోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనతో కొన్ని పార్టీలు తప్ప మెజార్టీ పార్టీల ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇక ముందు ప్రభుత్వం కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దుతో ఇకపై దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎలాగైతే కేంద్రం చేసిన చట్టాలు అమలు అవుతున్నాయో జమ్మూ కశ్మీర్లో కూడా ఆ చట్టాలు అమలు కానున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యనే కేంద్రం ట్రిపుల్ తలాక్ను నేరంగా పరిగణిస్తూ చట్టం చేసింది. ఇది జమ్ము కశ్మీర్లో అమలు అవుతుందా లేదా అనేదానిపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే కశ్మీర్లో చాలామంది భారత్కు చెందిన వారు కాదు. ఇతర దేశాల నుంచి అంటే పక్కనే ఉన్న అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ నుంచి వచ్చి సెటిల్ అయిన వారున్నారు. ఇప్పుడు అలా వచ్చిన వారి పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది. వారిని అసలైన భారతీయులుగా ఎలా గుర్తిస్తారు..? ఇందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇది కేంద్ర ప్రభుత్వం ముందున్న అసలు సవాలు.
బీజేపీ రాజకీయ ఎత్తుగడ వేసిందా..?
ఇక ఆర్టికల్ 370 రద్దు చేయడం ఒక రాజకీయ ఎత్తుగడ అని మరో వర్గం వాదన తెరపైకి తీసుకొస్తోంది. భారత దేశమంతా కాషాయ జెండా ఎగురవేసేందుకు కేంద్రం పావులు కదుపుతోందని కొందరు చర్చించుకుంటున్నారు. ఆర్టికల్ 370, 35 ఏ లను రద్దు చేసి అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే ఈ ఏడాది అక్టోబరులో మూడు రాష్ట్రాలకు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్కు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటే జమ్ముకశ్మీర్లో కూడా ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమకు లాభిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. జమ్ము కశ్మీర్ను భారత్లో పూర్తిగా అంతర్భాగం చేయాలనేది శివసేన వ్యవస్థాపకులు బాల్థాక్రే స్వప్నం కూడా. ఇక అది కూడా నెరవేరుతుండటంతో బీజేపీతో ఇప్పటికే పొత్తుతో ఉన్న శివసేనకు కూడా మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఇదే ఊపులోనే జమ్ము కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించి కాషాయ జెండా ఎగురవేసేందుకు కమలనాథులు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలో పీఓకేపై దాడి చేసే అవకాశముందా..?
ఇక జమ్మూ కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన ప్రభుత్వం లడక్ను కూడా కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తిస్తూ నిర్ణయం చేసింది. అయితే జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ వ్యవస్థ నడుస్తుంది కానీ లడఖ్లో మాత్రం ఎలాంటి ప్రభుత్వం ఉండదు. ఈ ప్రాంతం యొక్క పాలన కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోనుంది. ఇక్కడ అసెంబ్లీ వ్యవస్థ ఉండదు. మరోవైపు అన్ని సర్దుకున్నాక పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై దాడి చేసి భారత్లో కలుపుకోవాలనే యోచనలో ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమచారం. ఇందుకోసం అక్కడి పరిస్థితులను స్టడీ చేసేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరోసారి జమ్ముకశ్మీర్లో పర్యటించనున్నట్లు సమాచారం.