షాకింగ్: 5గురు ఎంపీల సస్పెన్షన్ -LJPలో సంచలనం -బాబాయిపై Chirag Paswan ప్రతీకారం -BJP అంతేగా
దళిత దిగ్గజం, బీహార్ లో కాకలుదీరిన యోధుల్ని సైతం తట్టుకుని నిలబడ్డ ధీరుడు, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా తన పదవిని మాత్రం కాపాడుకునే చాణక్యుడుగా రాంవిలాస్ పాశ్వాన్ కు పేరుండేది. అనారోగ్యంతో బాధపడుతూ పాశ్వాన్ ప్రాణాలు కోల్పోయి ఆరునెలలు గడిచిందో లేదో, ఆయన స్థాపించిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) మనుగడకు ముప్పు వాటిల్లింది. పార్టీపై పట్టుకోసం పాశ్వాన్ కొడుకు చిరాగ్, తమ్ముడు పశుపతి పారస్ ల మధ్య యుద్ధంలో బీజేపీ పెద్దలు బాబాయి వెంట నిలవడంతో అబ్బాయి బేజారైపోయాడు. ఆదిపత్య పోరును ఇంకా కొనసాగిస్తున్నట్లుగా చిరాగ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు..
Recommended Video
5గురు రెబల్ ఎంపీలపై వేటు
గతేడాది నవంబర్ లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, సరిగ్గా నెలరోజుల ముందు, అంటే, అక్టోబర్ లో రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూసే సమయానికే లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) జాతీయ అధ్యక్షుడిగా, పార్టీ పార్లమెంటరీ నేతగా కొడుకు చిరాగ్ పాశ్వాన్ ను నియమిచుకోవడం తెలిసిందే. అయితే, పాశ్వాన్ మరణం తర్వాత ఎల్జేపీలోని సీనియర్లు క్రమంగా చిరాగ్ విధానాలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ అమలు చేసిన ఎత్తుగడలను బాహాటంగానే విమర్శించారు. పార్టీలో ముసలం పెరిగిపెద్దదయి, ఇప్పుడు పరస్పర సస్పెన్ష దాకా చేరింది. పశుపతి నేతత్వంలోని ఐదుగురు ఎల్జేపీ ఎంపీలు ఏకమై, చిరాగ్ పాశ్వాన్ను ఎల్జేపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించగా, దానికి ప్రీతీకారంగా చిరాగే రెబల్ ఎంపీలపై వేటేశారు. సస్పెన్షన్ నిర్ణయాన్ని వెలువరిస్తూ, రెబల్ ఎంపీలు ద్రోహానికి పాల్పడ్డారని చిరాగ్ మాటగా ఎల్జేపీ నేత రాజు తివారీ వ్యాఖ్యలు చేశారు. ఎల్జీపీలో ఎంపీల తిరుబాటు వెనుక జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ హస్తం ఉండొచ్చని చిరాగ్ వర్గం ఆరోపిస్తోంది.
మూడు రోజుల హైడ్రామా..
బాబాబు పశుపతి, అబ్బాయి చిరాగ్ ల మధ్య కొన్నాళ్లుగా సాగుతోన్న విభేదాలు తాజాగా పుట్టబద్దలయ్యాయి. ఎంపీ పశుపతి పరాస్ నేతృత్వంలో ఎల్జేపీలో తిరుగుబాటు లేవడం, పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు... లోక్సభలో ఎల్జేపీ నేతగా పరాస్ను ఎన్నుకున్నట్లు ఆదివారం రాత్రి స్పీకర్ ఓం బిర్లాను కలిసి సంబంధిత పత్రాలు ఇవ్వడం, పరాస్ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ సోమవారం లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ను విడుదల చేయడం తెలిసందే. దీనికి కొనసాగింపుగా మంగళవారం కూడా పాట్నా, ఢిల్లీల్లో హైడ్రామా కొనసాగింది. అత్యవసరంగా సమావేశమైన పారాస్ బృందం, పార్టీ పదవి నుంచి చిరాగ్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుని, ఎల్జేపీ పార్లమెంటరీ నేతగా, పార్లమెంటరీ బోర్డు చైర్మన్గా, జాతీయాధ్యక్షుడిగా పారసే ఉంటారని స్పష్టం చేసింది. ఎల్జేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సూరజ్భాన్ సింగ్ ఉంటారని పేర్కొంది. కానీ, పార్టీకి ఇప్పటికీ తానే అధ్యక్షుడినని, పారస్ గ్రూప్ తీసుకున్న నిర్ణయాలు చెల్లబోవని, వాళ్లనే పార్టీ నుంచి వెలేస్తున్నానని చిరాగ్ తాజాగా ప్రకటించారు. కాగా,
బీజేపీతో దోస్తీ అంటే అంతేగా..
దళిత నాయకుడైన రాంవిలాస్ పాశ్వాన్ మొదటి భార్యకు విడాకులిచ్చిమరీ ఎయిర్ హోస్టెస్ రీనా శర్మను పెళ్లాడటం, వాళ్లిద్దరికీ పుట్టిన బిడ్డయిన చిరాగ్ ను ఎల్జేపీ వారసుడిగా ప్రకటించడాన్ని పార్టీలో చాలా మంది వ్యతిరేకించినా, ఆయన బతికున్నంత కాలం ఎవరూ బయటికి మాట్లాడలేకపోయారు. దళితోద్ధరణే ఆశయంగా ఏర్పడ్డ ఎల్జేపీకి ప్రస్తుత నేత చిరాగ్ ఏనాడూ కనీసం దళితుల పక్షాన నిలబడింది లేదని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తారు. తల్లి కులాన్ని ప్రస్తావిస్తూ అతను రాంవిలాస్ కు నిజమైన వారసుడు కాబోడనీ కొందరు నేతలు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, గతేడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అటు నితీశ్ కుమార్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ఇటు చిరాగ్ పాశ్వాన్ ను అస్త్రంగా వాడుకుంటూ నితీశ్ ను చావు దెబ్బ తీయడం తెలిసిందే. ఆనాడు బీజేపీకి పావులా పనిచేసిన చిరాగ్ ను ప్రస్తుత సంక్షోభంలో కేంద్ర పెద్దలు కాపాడకపోగా, చిరాగ్ బాబాయి పశుపతి చేతికి పార్టీ పగ్గాలు వెళ్లేలా లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది. నిజానికి బీజేపీతో దోస్తీ చేసిన ప్రాంతీయ పార్టీలు దాదాపు అన్నిటికీ ఇలాంటి గతే పట్టిందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఎల్జేపీలో జరిగిన, జరుగుతోన్న పరిణామాలపై చిరాగ్ పాశ్వాన్ బుధవారం మీడియాతో మాట్లాడనున్నారు.