ఈవీఎంల భద్రత: ఉల్లంఘిస్తే కాల్చిపారేయమని కలెక్టర్ ఆర్డర్, కలకలం
భోపాల్: ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంలోకి నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ప్రవేశించాలని చూస్తే కాల్చివేయాలని మధ్యప్రదేశ్లోని రేవా జిల్లా కలెక్టర్ సూచించినట్లుగా ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దీనిపై మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి వివరణ కోరారు. ఆ వీడియోలో ఉన్నదాని ప్రకారం ఆమె గది బయట ఉన్న సెక్యూరిటీకి ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇది వివాదాస్పదంగా మారింది.
గత నెల 28వ తేదీన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు ముగిశాక ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. ఈవీఎంల భద్రతపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఈ వీడియో బయటకు వచ్చింది.
ఈ వీడియో ప్రకారం.. రేవా జిల్లా కలెక్టర్ ప్రీతి మైథిలి అక్కడి సిబ్బందికి సూచనలు చేస్తూ కనిపించారు. ఎన్నికల సమయంలో జిల్లా కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులుగా ఉంటారు. ఆ జిల్లా ఎన్నికల ప్రక్రియను వారే పరిశీలిస్తారు.
ఈ నేపథ్యంలో అభ్యర్థులతో కలిసి స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్న భద్రతను కలెక్టర్ పరిశీలించారు. ఈ సమయంలో ఈ వీడియో తీసినట్లుగా ఉంది. తన కెరీర్ను ఇబ్బందుల్లో పెట్టుకోనని, మీరు అతడిని నమ్మండి అంటూ సెక్యూరిటీ వైపు తిరిగి.. నీ మాట వినకుండా, నిబంధనలను ఉల్లంఘించిన వారిని కాల్చివెయ్ అని అందులో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ అంశంపై నివేదిక కోరామని, భారత ఎన్నికల సంఘానికి పంపిస్తామని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.