ఉక్కిరిబిక్కిరైన రియా... విచారణలో కన్నీటిపర్యంతం... అప్పుడు సవాల్ విసిరి... ఇప్పుడు నేరం ఒప్పుకుని..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో తొలి నుంచి తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని మంగళవారం ఎన్సీబీ(నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ లింకులకు సంబంధించి రియా నేరం ఒప్పుకోవడంతో ఎన్సీబీ ఆమెను అదుపులోకి తీసుకుంది. అంతకుముందు విచారణ సందర్భంగా రియా చక్రవర్తి బోరున విలపించింది. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టయిన తన సోదరుడు షోయిక్ చక్రవర్తి గురించి విచారణలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నించడంతో రియా కన్నీటిపర్యంతమైంది. అధికారుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిన ఆమె చాలాసేపు ఏడ్చినట్లు తెలుస్తోంది.
నిజం ఒప్పుకున్న రియా...
సుశాంత్ సింగ్ రాజ్పుత్కు డ్రగ్స్ అందించినట్లు విచారణలో రియా అంగీకరించింది. అంతేకాదు,సుశాంత్,షోయిక్లతో కలిసి తాను కూడా డ్రగ్స్ తీసుకునేదాన్ని అని ఒప్పుకుంది. అయితే డ్రగ్స్ డీలర్తో మాత్రం తనకు నేరుగా ఎలాంటి సంబంధాలు లేవని చెప్పింది. కరోనా లాక్ డౌన్ పీరియడ్లో డ్రగ్స్ దొరకడం కష్టంగా మారడంతో తన సోదరుడు షోయిక్ ద్వారానే డ్రగ్స్ తెప్పించుకున్నట్లు రియా అంగీకరించిందని ఓ ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. మార్చి-జూన్ మధ్యలో మొత్తం 165గ్రా. మారిజునా మత్తు పదార్థాలు సుశాంత్ ఇంటికి డెలివరీ అయినట్లు నార్కోటిక్స్ అధికారులు గుర్తించారు. సుశాంత్ ఇంట్లో పనిచేసే దీపేశ్ సావంత్ రియా ఆదేశాల మేరకు ఆ డ్రగ్స్ను సుశాంత్కి అందించినట్లు గుర్తించారు.
అప్పుడు సవాల్ విసిరి మరీ...
గత మూడు రోజులుగా రియా చక్రవర్తి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణను ఎదుర్కొంటున్నారు. నిజానికి ఈ కేసులో ఎన్సీబీ ఎంట్రీ ఇచ్చినప్పుడు రియా,ఆమె తరుపు లాయర్ గట్టిగా బుకాయించే ప్రయత్నం చేశారు. తన క్లయింట్ రియా జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ జోలికి పోలేదని ఆమె తరుపు న్యాయవాది వాదించారు. రియా కూడా తన జీవితంలో ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని... అవసరమైతే బ్లడ్ టెస్టుకైనా రెడీ అని పలు ఇంటర్వ్యూల్లో సవాల్ విసిరింది. తీరా ఎన్సీబీ విచారణలో మాత్రం తనకు కూడా డ్రగ్స్ అలవాటు ఉందని ఒప్పుకోవడం గమనార్హం.
చేతులు ఊపుతూ... ఏం సంకేతాలు...?
అరెస్ట్ అనంతరం పోలీసులు రియా చక్రవర్తిని వ్యానులో ఎక్కిస్తుండగా... మీడియా కెమెరాల వైపు ఆమె చేతులు ఊపుతూ సైగలు చేయడం గమనార్హం. మొదటిరోజు విచారణకు హాజరైన సందర్భంగా రిపోర్టర్లు రియాకు అడ్డుపడి ఉక్కిరిబిక్కిరి చేసిన నేపథ్యంలో... ఆమె అలా స్పందించినట్లు తెలుస్తోంది. తాను మళ్లీ తిరిగొస్తానని... తప్పకుండా న్యాయ పోరాటం చేస్తానన్న సంకేతాలు పంపించేందుకే రియా అలా చేతులు ఊపి ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రియాకు కరోనా నెగటివ్...
మంగళవారం బ్లాక్ టీషర్ట్,బ్లూ జీన్స్లో రియా ఎన్సీబీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె టీషర్ట్పై రాసి వున్న ఓ కొటేషన్ చాలామంది దృష్టిని ఆకర్షించింది. 'గులాబీలు ఎరుపు... వయొలెట్స్ నీలం... మీరు,నేనూ కలిసి పితృస్వామ్యాన్ని అంతం చేద్దాం..' అన్న ఆ కొటేషన్ మీడియాలోనూ హైలైట్ అయింది. అరెస్ట్ అనంతరం రియా చక్రవర్తిని వైద్య పరీక్షల నిమిత్తం ముంబైలోని సియోన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు కరోనా టెస్టులు చేయగా నెగటివ్గా తేలింది. రాత్రి 7.30గం. సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.