షాకింగ్ : మేకలకు,గొర్రెలకు పెట్టే బియ్యం మనుషులకు... 'రేషన్' అక్రమాలు...
చౌక ధరల దుకాణం ద్వారా తెల్లకార్డు దారులకు అందించే బియ్యం పంపిణీలో అవకతవకలు... ఏమాత్రం నాణ్యత లేని పాడైపోయిన బియ్యాన్ని పేదలకు అంటగడుతున్న వైనం.... నిజానికి ఆ బియ్యం కేటగిరీని పరిశీలిస్తే అవి మేకలు,గుర్రాలకు దానా కింద ఉపయోగించే బియ్యం... మధ్యప్రదేశ్లోని చౌక ధరల దుకాణాల్లో ఈ అవకతవకలు బయటపడ్డాయి.
ఇటీవల మధ్యప్రదేశ్లోని మండ్ల,బాలాఘట్ సహా పలు జిల్లాల్లోని చౌక ధరల దుకాణాల్లో కేంద్ర పౌర సరఫరాల శాఖ చేసిన తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. ఆ దుకాణాల్లో నాణ్యత లేని,పాడైపోయిన బియ్యాన్ని తెల్లకార్డు దారులకు అందిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. ఆ బియ్యాన్ని మూడు కేటగిరీలుగా గుర్తించినట్లు చెప్పారు. 1) మేకలు,గొర్రెలు,గుర్రాలకు దానాగా ఉపయోగించే బియ్యం 2) పశువులకు దానాగా ఉపయోగించే బియ్యం 3) పౌల్ట్రీలో దానాగా ఉపయోగించే బియ్యం.
గోదాముల్లో నుంచి జులై 2020న కొత్త స్టాక్ కొనుగోలు చేసినట్లుగా అధికారులు రశీదులను గుర్తించారు. కానీ చౌక ధరల దుకాణాల్లో ఉన్న బియ్యం మాత్రం పాడైపోయిన పాత స్టాక్. పాడైపోయిన బియ్యాన్నే రీసైక్లింగ్ చేసి దుకాణాలకు చేర్చినట్లు గుర్తించారు. ఆ బియ్యాన్ని నిల్వ చేసిన గన్నీ బ్యాగులు కూడా 2-3 ఏళ్ల పాతవని తేల్చారు. అంటే,స్థానిక అధికారులు కొత్త స్టాక్ తెచ్చి పంపిణీ చేస్తున్నట్లుగా కేవలం రశీదులు తెచ్చుకుని... పాడైపోయిన పాత బియ్యాన్ని ప్రజలకు అంటగడుతున్నట్లు నిర్దారించారు.
Recommended Video
ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక ఉన్నవారినపై క్రిమినల్ కేసులు పెడుతామని చెప్పారు. మిల్లర్లతో కుమ్మక్కై ఈ అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చౌకధరల దుకాణాల్లో ఉన్న ఆ నాణ్యత లేని బియ్యాన్ని వెంటనే సీజ్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు.