పేరుకే యాచకుడు: డబ్బులను లెక్కబెట్టేందుకు 8 గంటల సమయం..ఎంతో తెలుసా..?
ముంబై: కొద్దిరోజుల క్రితం ముంబైలో నివసిస్తున్న ఓ యాచకుడు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో బీర్బిచంద్ ఆజాద్ అనే యాచకుడు భిక్షాటన ద్వారా లక్షలు గడించాడనే వార్త ప్రచారం జరిగింది. తాజాగా బీర్భిచంద్ ఆజాద్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈ సారి ఆయన మృతి చెందడంతో వార్తల్లోకెక్కాడు. సామాన్య యాచకుడు వార్తల్లోకి ఎక్కాల్సిన అవసరం ఏముందనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం.
రైలు ఢీకొనడంతో బీర్భిచంద్ ఆజాద్ మృతి
బీర్బిచంద్ ఆజాద్.. ముంబై ప్రధాన కూడళ్లలో యాచిస్తూ కనిపిస్తాడు. అయితే ఇకపై ఈయన కనిపించడు. ఎందుకంటే శుక్రవారం రాత్రి గోవాండీలో రైల్వే పట్టాలు దాటుతుండగా ఓ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. అయితే ఒక యాచకుడు గురించి ఇంతపెద్ద వార్త ఎందుకనేది చాలా మందికి అనుమానం రావొచ్చు. అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. బీర్బీ చంద్ మృతి చెందడంతో ఆయన ఎవరో ఎక్కడుంటాడో కనుక్కొన్న పోలీసులు తన నివాసం ఉండే చోటుకు వెళ్లారు. అక్కడ ఎవరూ లేరు. ఆజాద్కు సంబంధించిన వారి ఆచూకీ ఏమైనా లభ్యమవుతుందేమో అని పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు.
ఎనిమిది గంటల పాటు డబ్బులు లెక్కబెట్టిన పోలీసులు
ఆజాద్ ఇంట్లో సోదాలు నిర్వహించగా వారికి కొన్ని గోనె సంచులు, బకెట్లు కనిపించాయి. అందులో ఆజాద్ యాచించడం ద్వారా వచ్చిన డబ్బులు ఉన్నాయి. అయితే అవన్నీ కాయిన్స్ కావడం విశేషం. ఇక ఆ డబ్బులు ఎంతున్నాయో లెక్కబెట్టసాగారు పోలీసులు. ఒక గంట దాటింది... రెండు గంటలు దాటాయి.. మూడు గంటలు దాటాయి లెక్కింపు మాత్రం ముగియలేదు. అలా ఎనిమిది గంటలు లెక్కిస్తే ఆజాద్ యాచించడం ద్వారా వచ్చిన డబ్బు రూ. 1.77 లక్షలుగా తేలింది. ఈ కాయిన్లన్నిటినీ ఆరు గోనె సంచుల్లో, బకెట్లలో దాచి ఉంచాడు. అంతేకాదు పోలీసుల సోదాల్లో పలు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన బాండ్లు బయటపడ్డాయి. వీటి విలువ రూ. 8.77 లక్షలు. ఇక ఆజాద్కు పాన్ కార్డు, సీనియర్ సిటిజెన్ కార్డు, ఆధార్ కార్డు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పేరుకే యాచకుడు.. కానీ లక్షలు సంపాదించాడు
ఇదిలా ఉంటే ఆజాద్ ఒక యాచకుడని స్లమ్లో ఉన్న స్థానికులు చెప్పినట్లు పోలీసులు చెప్పారు. ముంబైలోని ఇతర యాచకులు ఆజాద్ను గుర్తుపట్టినట్లు ఇన్స్పెక్టర్ నందకుమార్ తెలిపారు.ఇక తమకు దొరికిన డాక్యుమెంట్లను పరిశీలించగా ఆజాద్ రాజస్థాన్కు చెందినవాడిగా గుర్తించామని పోలీసులు చెప్పారు. ముంబైలో ఒక్కడే నివసిస్తున్నట్లు చెప్పారు. ఓ చిన్న గదిలో ఇంత పెద్ద మొత్తం అది కూడా కాయిన్లు మాత్రమే ఉండటంతో ఈ లెక్కింపును శనివారం రాత్రి మొదలు పెడితే ఆదివారం ఉదయానికి పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు.
సొంత రాష్ట్రం రాజస్థాన్
ఆజాద్ గోవండీ ప్రాంతంలో కొన్నేళ్లుగా నివసిస్తున్నాడని రైల్వే స్టేషన్, ముంబై హార్బర్ వద్ద ఎక్కువగా భిక్షాటన చేసే వాడని పోలీసులు చెప్పారు. తన పిల్లల కోసమే తాను ముంబైలో నివాసముంటున్నట్లు అప్పుడప్పుడు ఇతర యాచకులతో ఆజాద్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మురికివాడలో చాలామంది యాచకులు ఉంటారు కానీ.. ఆజాద్ ఇంత పెద్ద మొత్తంలో డబ్బులను కూడగడుతాడని ఊహించలేకపోయినట్లు మరో యాచకుడు తెలిపాడు.