ఖురాన్లు పంచే ప్రసక్తే లేదు.. రాంచీ కోర్టు షరతుపై హైకోర్టుకు వెళ్తానన్న రిచా భారతి..
రాంచీ : ఓ మతాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందంటూ రిచా భారతి అనే యువతి విషయంలో రాంచీ కోర్టు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఆమెకు కండీషనల్ బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం ఐదు కాపీల ఖారాన్లను పంచాలని షరతు విధించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు విధించిన షరతుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తానే తప్పు చేయకపోయినా రాంచీ కోర్టు ఇలాంటి కండిషన్ పెట్టడంపై హైకోర్టులో అప్పీల్ చేస్తానని రిచా భారతీ అంటోంది.
ఐదు ఖురాన్లు పంచాలని షరతు
రాంచీలోని ఓ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రిచా భారతి రోహింగ్యాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. అయితే అది మైనార్టీల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ అంజుమన్ ఇస్లామియా కమిటీ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీనిపై స్పందించిన పితోరియా పోలీసులు శనివారం రాత్రి రిచా భారతిని అరెస్ట్ చేశారు. ఆమె బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేయగా.. విచారించిన మెజిస్ట్రేట్ కండీషనల్ బెయిల్ మంజూరు చేశారు. అంజుమన్ ఇస్లామియా కమిటీతో పాటు స్కూళ్లు, కాలేజీ లైబ్రరీలకు ఐదు కాపీల ఖరాన్లను అందజేయాలని షరతు విధించింది. పోలీసుల సమక్షంలో ఇది జరగాలని, దీనికి సంబంధించిన నివేదికను పక్షం రోజుల్లో కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
హైకోర్టులో అప్పీలు
మంగళవారం సాయంత్రంలోగా అంజుమన్ కమిటీకి ఖురాన్ అందజేయాల్సి ఉండగా రిచా మాత్రం అందుకు నిరాకరించారు. కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా తమకు అందలేదని చెప్పారు. కోర్టు నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె.. రోహింగ్యాలు భారత్లో ఉండేందుకు అనుమతించాలన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానే తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. కోర్టు విధించిన షరతుపై స్పందించిన రిచా భారతి హిందువులు, ఇతర మతాల వారి మనోభావాలు దెబ్బతీసే పోస్టింగ్లు చేసిన వారికి భగవద్గీత, బైబిల్లు పంచాలన్న షరతుతో బెయిల్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రాంచీ కోర్టు నిర్ణయంపై కుటుంబసభ్యులు, లాయర్తో చర్చించి హైకోర్టులో అప్పీల్ చేస్తానని రిచా భారతి స్పష్టం చేశారు.
రిచాకు పెరుగుతున్న మద్దతు
ఖురాన్లు పంచాలన్న షరతును వ్యతిరేకిస్తున్న రిచాకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. రాంచీ కోర్టు నిర్ణయాన్ని హిందూ సంఘాల ప్రతినిధులతో పాటు బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. పలువురు నేతలు రిచా ఇంటికి వెళ్లి ఆమెకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఆమె పోరాటానికి మద్దతుగా నిలుస్తామని భరోసా ఇస్తున్నారు.