గల్లా, కొండానే: టెక్కీ నీలేకని... టాప్10 కోటీశ్వర్ల ఓటమి
హైదరాబాద్/బెంగళూరు: దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హవా ధాటికి పలువురు కోటీశ్వరులు ఓడిపోగా, ఒకరిద్దరు మాత్రం నిలదొక్కుకున్నారు. ఎక్కువ ఆస్తులున్న తొలి పదిమంది కోటీశ్వరుల్లో ఎనిమిది మంది ఓడిపోగా ఇద్దరు మాత్రమే గెలిచారు. వారిద్దరు కూడా మన రాష్ట్రానికి చెందిన గల్లా జయదేవ్ (టిడిపి), కొండా విశ్వేశ్వర రెడ్డి (తెరాస)లు కావడం గమనార్హం.
ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖ టెక్కీ, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని ఓడిపోయారు. ఆయన ఆధార్ చైర్మన్గా వ్యవహరించారు. నందన్ నీలేకని కర్నాటకలోని బెంగళూరు దక్షిణ నుండి పోటీ చేసి బిజెపి అభ్యర్థి అనంత్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఈయన ఆస్తులు ఏడువేల ఏడువందలకు పైగా కోట్లు.
రెండువేల కోట్లతో రెండో స్థానంలో ఉన్న షమాలీ దాస్ పశ్చిమ బెంగాల్లోని కోల్కతా దక్షిణ, జాదవ్ పూర్.. రెండు నియోజకవర్గాల నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన రెండు స్థానాల్లో ఓడిపోయారు. బీహార్ జెడియు నేత అనిల్ కుమార్ శర్మ రాష్ట్రీయ లోక సమతా పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈయన ఆస్తులు రూ.849 కోట్లు.
నరసారావుపేట నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసిన అయోధ్య రామిరెడ్డి 654 కోట్లతో దేశంలో ఐదో స్థానంలో ఉన్నారు. ఆయన రాయపాటి చేతిలో ఓడిపోయారు. రూ.338 కోట్లున్న టిడిపి నేత నామా నాగేశ్వర రావు ఖమ్మం నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేతిలో ఓడిపోయారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ హర్యానాలోని కురుక్షేత్ర నుండి పోటీ చేసి ఓడారు. ఆయన ఆస్తులు రూ.308 కోట్లు. దేశంలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు.
రూ.306 కోట్లున్న మోనీ కుమార్ సుబ్బా అస్సాంలోని తేజ్ పూర్ నుండి స్వతంత్ర అభ్యర్థఇగా పోటీ చేసి ఓడిపోయారు. యూపిలోని బిజ్నోర్ నుండి బిఎస్పీ అభ్యర్థి మలూక్ నాగర్ రూ.289 కోట్లతో పదో స్థానంలో ఉన్నారు. ఈయన కూడా ఓడిపోయారు.
గెలిచిన వారిలో గుంటూరు టిడిపి ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్... రూ.683 కోట్లతో దేశంలో నాలుగో స్థానంలో, చేవెళ్ల తెరాస ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి... రూ.528 కోట్లతో దేశంలో ఆరవ స్థానంలో ఉన్నారు.