వెల్త్ X రిపోర్ట్: క్రికెటర్లలో సచినే సంపన్నుడు
లండన్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 160 మిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో భారతదేశంలోని క్రికెటర్లలో అత్యధిక ధనవంతుడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బుధవారం హర్యానా జట్టుతో జరిగిన తన చివరి రంజీ ట్రోఫీలో ముంబై జట్టును మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఒంటిచేత్తో గెలిపించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్తో రంజీ ట్రోఫీలకు సచిన్ టెండూల్కర్ వీడ్కోలు పలికాడు.
ఈ నేపథ్యంలో ప్రపంచంలోని ప్రముఖుల సంపదను విశ్లేషించడంలో పేరుపొందిన సంస్థ వెల్త్ X(10).. సచిన్ టెండూల్కర్ భారతదేశంలో అత్యధిక సంపద కలిగిన క్రికెట్ ఆటగాడని బుధవారం ప్రకటించింది. సచిన్ సంపద భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంపద కంటే మూడు రేట్లు ఎక్కువగా ఉందని తెలిపింది. ఇంకా కొందరు ఆటగాళ్లతో సచిన్ టెండూల్కర్ సంపదను పోల్చుతూ నివేదికను వెల్లడించింది.
సచిన్ టెండూల్కర్ సంపద యువరాజ్ సింగ్ సంపద కంటే ఐదు రేట్లు, రాహుల్ ద్రావిడ్ కంటే ఎనిమిది రేట్లు, భారత వైస్కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే పది రేట్లు ఎక్కువగా ఉందని వెల్త్ సంస్థ పేర్కొంది. నవంబర్ నెలలో వెస్డిండీస్ జట్టుతో టెస్టు సిరీస్తో తన క్రికెట్ జీవితానికి సచిన్ టెండూల్కర్ ముగింపు పలకనున్న నేపథ్యంలో ఈ సంస్థ తన నివేదికను వెల్లడించింది.
వెల్త్ సంస్థ వెల్లడించిన తన నివేదికలో భారతదేశంలోని అత్యధిక సంపద కలిగిన తొలి ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. ఇందులో 160 మిలియన్ డాలర్లతో మాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా, 50 మిలియన్ డాలర్ల సంపదతో మహేంద్రసింగ్ ధోనీ రెండో స్థానంలో నిలిచాడు. 30 మిలియన్ డాలర్లతో యువరాజ్ మూడవ స్థానంలో, 20 మిలియన్ డాలర్లతో రాహుల్ ద్రావిడ్ నాల్గవ స్థానంలో, 15 మిలియన్ డాలర్లతో కోహ్లీ ఐదవ స్థానంలో ఉన్నారు.