నా కూతురు పెళ్లికి రండి: ప్రధానికి రిక్షావాలా ఆహ్వానం..మోడీ ఏమన్నారో తెలుసా..?
అతనో సాధారణ రిక్షావాలా.. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం అతనిది. తన జీవితమంతా రిక్షా తొక్కి వచ్చిన డబ్బులు దాచుకుని ఇప్పుడు పెళ్లీడుకొచ్చిన తన కూతురుకు పెళ్లి చేస్తున్నాడు. ఈ పెళ్లికి బంధువులతో పాటు తన స్నేహితులను కూడా ఆహ్వానించాడు. తను ఆహ్వానం పంపిన వారిలో ఒక వీఐపీ కూడా ఉన్నాడు.. ఇంతకీ ఆ వీఐపీ ఎవరు..? రిక్షావాలా కూతురు పెళ్లికి వస్తున్నారా..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నా కూతురు వివాహానికి రండి
ఉత్తర్ ప్రదేశ్లో ఓ రిక్షావాలా తన కూతురు పెళ్లి చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన బంధుమిత్రులతో పాటు పలువురికి ఆహ్వానం పంపాడు. ఇలా ఆహ్వానం పంపిన వారిలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. అవును ఇది నిజం. డూమ్రీ గ్రామంకు చెందిన మంగళ్ కెవాత్ ప్రధాని నరేంద్ర మోడీకి తన కూతురు పెళ్లిపత్రికను పంపాడు. తన కూతురు పెళ్లికి వచ్చి ఆశీర్వదించాల్సిందిగా మంగళ్ కెవాత్ ప్రధానిని కోరారు. ఈ వివాహ పత్రికను ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంకు పంపాడు. ఫిబ్రవరి 12న తన కూతురు వివాహం జరుగుతుందని చెప్పాడు కెవాత్. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
రిక్షావాలాకు లేఖ రాసిన ప్రధాని
కొంతమంది తన మిత్రులు ప్రధాని మోడీని కూతురు వివాహంకు ఆహ్వానించాలని కోరడంతో తాను ప్రధాని కార్యాలయంకు వివాహ ఆహ్వాన పత్రిక పంపినట్లు చెప్పాడు మంగళ్ కెవాత్. ఒకటి ఢిల్లీ కార్యాలయానికి మరొకటి ప్రధాని ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలోని ఆయన కార్యాలయానికి పంపమని సలహా ఇవ్వడంతో రెండు వెడ్డింగ్ కార్డులను పంపినట్లు కెవాత్ చెప్పాడు. ఇక వివాహ ఆహ్వాన పత్రికను చూసిన ప్రధాని మోడీ రిక్షావాలాకు అతని కూతురుకు అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. రిక్షావాలా కుటుంబం తన కూతురికి తన ఆశీస్సులను తెలియజేశారు ప్రధాని మోడీ. ఇదే లేఖను పంపగా కచ్చితంగా ఫిబ్రవరి 12న అంటే తన కూతురు వివాహం రోజునే ప్రధాని రాసిన లేఖ అందింది.
లేఖ చూసి ఆనందంతో గెంతేసిన రిక్షావాలా
ప్రధాని మోడీ దగ్గర నుంచి లేఖ వస్తుందని తామెప్పుడు అనుకోలేదని ఒక్కసారిగా లేఖ చూడటంతో తను తన కుటుంబ సభ్యులు చాలా సంతోషించామని కెవాత్ చెప్పాడు. ప్రధాని మోడీ నుంచి వచ్చిన లేఖను తన బంధు మిత్రులందరికీ చూపించిన రిక్షావాలా.. ఆ లేఖను జీవితాంతం దాచుకుంటానని చెప్పారు. ఇదిలా ఉంటే గంగామాతకు కెవాత్ గొప్ప భక్తుడు. రిక్షా తొక్కి దానివల్ల వచ్చిన సంపాదనలో కొంత గంగానదికి పూజలు చేసేందుకు వినియోగిస్తారు. స్వచ్ఛ్ భారత్ క్యాంపెయిన్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటాడు కెవాత్. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రధాని మోడీచే సభ్యత్వం నమోదు చేయించుకున్నాడు మంగళ్ కెవాత్.