హెల్మెట్ లేకుండా బైకు నడిపితే... కొత్త పనిష్మెంట్ ఇస్తున్న ట్రాఫిక్ పోలీసులు
భోపాల్: ఈ మధ్య ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాలు చాలా భారీగా ఉంటున్నాయి. అసలు వాహనంలో వెళ్లడంకంటే ప్రభుత్వం అధీనంలో నడిచే బస్సుల్లో ప్రయాణం చేయడం మంచిదన్న ఆలోచన చేస్తున్నారు వాహనదారులు. కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన జరిమానాలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్లో వెరైటీ పనిష్మెంట్
కొన్ని రోజుల క్రితం కోటి రూపాయలు పెట్టి పోర్షే లగ్జరీ కారు కొన్న ఓ కస్టమర్.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో రూ.30 లక్షలు జరిమానా కట్టాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా చాలా వెలుగులోకి వచ్చాయి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన జరిమానా విధానాలను తప్పనిసరిగా అమలు చేస్తున్నాయి. అయితే మధ్యప్రదేశ్లోని భోపాల్లో మాత్రం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిచిన వాహనదారులకు వెరైటీ పనిష్మెంట్ ఇస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
హెల్మెట్ ధరించడం మరిచామో...
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు వెరైటీ పనిష్మెంట్ ఇస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు చిక్కితే వారితో ఓ ఎస్సే రాయిస్తున్నారు. హెల్మెట్ ధరించకుండా బైకును నడుపే వారికి మాత్రమే ఈ వెరైటీ పనిష్మెంట్. అసలు హెల్మెట్ ఎందుకు ధరించలేదో, హెల్మెట్ మర్చిపోయామని కాకమ్మ కథలు చెబితే ఎందుకు మర్చిపోయారో కారణం చెబుతూ ఒక ఎస్సే రాయిస్తున్నారు.
100 పదాలతో కూడిన ఎస్సే
గత ఆరురోజులుగా భోపాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు దాదాపు 150 మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులను పట్టుకున్నారు. వీరంతా హెల్మెట్ ధరించకుండా బైకును నడుపుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వీరితో 100 పదాలతో కూడిన ఎస్సే రాయించారు ట్రాఫిక్ పోలీసులు. జనవరి 11 నుంచి 17 వరకు రోడ్ సేఫ్టీ వీక్ ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులచే పనిష్మెంట్ కింద ఈ ఎస్సే రాయిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇక శుక్రవారంతో ఈ రోడ్ సేఫ్టీ వారోత్సవాలు ముగుస్తాయి.
రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా అవగాహన
రోడ్ సేఫ్టీ వారోత్సవంలో భాగంగా గత ఆరురోజులుగా ట్రాఫిక్ నిబంధనలపై సామాన్యులకు, వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు ర్యాలీలు తీశారు. ఈ సందర్భంగా పామ్ప్లేట్లు కూడా ముద్రించి పంచారు. ట్రాఫిక్ రూల్స్ గురించి వాటిని పాటించకపోతే ఎలాంటి జరిమానాలు విధించబడుతాయో అనేవి ముద్రించారు. అంతేకాదు ఆటో డ్రైవర్లకు కంటిపరీక్షలు కూడా ఈ వారోత్సవాల్లో భాగంగానిర్వహించినట్లు ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.