హర్టయ్యా, బాగా బాధిస్తోంది: పార్టీలో ముసలంపై అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ అద్మీ పార్టీలోని విభేదాల పైన ఆ పార్టీ సమన్వయకర్త, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విభేదాల పైన ఆయన ట్విట్టర్లో స్పందించారు. పార్టీలోని తీరు పట్ల తాను బాగా హర్ట్ అయ్యానని, బాధపడుతున్నానని పేర్కొన్నారు. ఇలా చేస్తే ఢిల్లీ ప్రజలు మన పైన పెట్టుకున్న దానిని నమ్మక ద్రోహం చేసినట్లే అన్నారు.
మరో ట్వీట్లో.. ఇలాంటి చెత్త ఫైట్లోకి తనను లాగడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, తాను ఢిల్లీ పాలన పైననే దృష్టి సారిస్తానని చెప్పారు. ప్రజలకు మంచి చేయడమే తనకు ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
కాగా, ఏఏపీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. బుధవారం జరుగనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సీనియర్ నాయకులు యోగేంద్ర యాదవ్, శాంతి భూషణ్లపై చర్య తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను పార్టీ జాతీయ కన్వీనర్ పదవి నుంచి తొలగించేందుకు వీరిద్దరు నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
ఏఏపీ నాయకుడు సంజయ్ సింగ్ సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ శాంతి భూషణ్పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ స్థానంలో పార్టీ జాతీయ కన్వీనర్గా యోగేంద్ర యాదవ్ను నియమించాలని శాంతిభూషణ్ ఇటీవల విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
పార్టీలోని ఒక నాయకుడు, మరికొంత మంది సీనియర్ నాయకులు పార్టీ జాతీయ కన్వీనర్ పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని, కేజ్రీవాల్ను లక్ష్యంగా చేసుకొని పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని సంజయ్ సింగ్ సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు. అయితే ఆయన శాంతి భూషణ్, యోగేంద్ర యాదవ్ పేర్లు ప్రస్తావించలేదు.
వారు చేసిన వ్యాఖ్యలు, రాసిన లేఖలను మాత్రమే ప్రస్తావించారు. వారు రాసిన లేఖలు మీడియాకు లీకు కావడం పట్ల రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఏసి) సభ్యుడు కూడా అయిన సంజయ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని మీడియా ద్వారా ప్రజల్లోకి తీసికెళ్లడానికి ముందు పార్టీ వేదికపై చర్చకు పెట్టి ఉండాల్సిందని ఆయన హితవు చెప్పారు.
తాజాగా పార్టీలో నెలకొన్న విభేదాలు సహా అన్ని అంశాలపై బుధవారం సమావేశం కానున్న పార్టీ జాతీయ కార్యవర్గం నిర్ణయిస్తుందని ఆయన ప్రకటించారు. శాంతి భూషణ్, యోగేంద్ర యాదవ్లను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నుంచి తొలగిస్తారా? అని ప్రశ్నించగా.. సంజయ్ సింగ్ సూటిగా సమాధానం ఇవ్వలేదు.