రాజస్థాన్ అసెంబ్లీలో అరుదైన ఘటన: ఆ పార్టీ నుంచి సభకు ఎంతమంది హాజరయ్యారో తెలుసా?
కర్నాటకలో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడింది. ఇక బీజేపీ ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కూడా కన్నేసింది. ఇందులో భాగంగానే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. తాజాగా రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి ఛాన్స్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య నెలకొన్న విబేధాలు ఇందుకు కారణమని రాజస్తాన్ రాజకీయ వర్గాల్లో వినికిడి.
రాజస్థాన్ రాజకీయా పరిణామాలు మారుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారిక కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెుల్యే అది కూడా డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మాత్రమే హాజరయ్యారు. దీంతో ప్రతిపక్ష బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభకు హాజరుకాకపోవడంతో విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ నుంచి లేదా ప్రభుత్వం నుంచి ఒక్క సభ్యుడు కూడా లేరని ఒక్క సచిన్ పైలట్ మాత్రమే సభకు హాజరయ్యారని బీజేపీ నేత ఒకరు స్పీకర్తో చెప్పారు. ఇందుకు పైలట్ లేచినిలబడి బీజేపీ సభ్యులందరి ప్రశ్నలకు తానొక్కడినే సమాధానం ఇవ్వగలనని స్పీకర్తో చెప్పారు.
ఇక మరో బీజేపీ నేత లేచి నిలబడి తాము కూడా ఎన్నికలకు ముందు ఇదే ధీమాను వ్యక్తం చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్కు తాము కంపెనీ ఇవ్వాలంటే ఇస్తామంటూ ఛలోక్తులు విసిరారు. ఇదిలా ఉంటే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అధికారం కోసం పాకులాడుతోందని సీఎం అశోక్ గెహ్లాట్ విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అధ్వాన పరిస్థితుల్లో ఉందని దీన్ని గురించి పట్టించుకోవడం మానేసి బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఎలా కూల్చాలన్నదానిపై దృష్టి పెట్టిందన్నారు. యువత, రైతులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని చెప్పిన గెహ్లాట్...ప్రభుత్వం వీరిగురించి ఆలోచించడం మానేసిందని చెప్పారు. దేశంలో వర్షాలు కూడా సరిగ్గా పడటం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైతు సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు దృష్టి సారిస్తోందని మండిపడ్డారు.