సప్నా చౌదరి ఈవెంట్: బిజెపి నేతల మధ్య మాటల యుద్దం
లక్నో: హర్యాన్వీ డ్యాన్సర్ సప్నా చౌదరి ఈవెంట్ టికెట్లపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫొటో ముద్రించడంపై ఉత్తరప్రదేశ్ బీజేపీలో వివాదం రాజుకుంది. రాష్ట్ర బీజేపీ నేత నీలిమా కటియార్, బీజేపీ చీఫ్ సురేంద్ర మైథాని ఈవెంట్ టికెట్లపై యోగి ఆదిత్యనాథ్ ఫొటోను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవెంట్ విషయమై బిజెపిలో చిచ్చు రేగింది. పోటో ముద్రించడంపై నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది.
బిజెపికి చెందిన కాన్పూర్ మేయర్ మాత్రం ఈవెంట్ టికెట్లపై ముఖ్యమంత్రి ఫొటోను ముద్రించడాన్ని సమర్థించారు. టికెట్లు లేకుండా ఈవెంట్లోకి వెళ్లేందుకు పలువురు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపుతప్పింది.
దీంతో భద్రతగా ఉన్న పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఆగ్రహించిన కొందరు పార్క్ చేసి ఉన్న వాహనాలపై రాళ్ల దాడికి దిగారు.
ఈ కార్యక్రమం యూపీ ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. కొద్దిరోజుల కిందట ముఖ్యమంత్రి చేతులు మీదుగా అవార్డు అందుకున్నందుకు ఆయన ఈవెంట్ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ప్రభుత్వ అధికారులకు, ప్రముఖులకు ఈవెంట్కు పెద్ద ఎత్తున ఉచితంగా టికెట్లు అందజేసినట్లు తెలిసింది. సాధారణంగా టికెట్లు భారీగా అమ్ముడుపోయినట్లు సమాచారం.