ఏఏపీలో ముసలం: కేజ్రీవాల్ను గద్దెదించే కుట్ర, బాంబు పేల్చిన పాండే
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం వచ్చిన విషయం తెలిసిందే. ఏఏపీలో విభేదాల పైన ఆ పార్టీ సీనియర్ నేత అశుతోష్ ట్వీట్ చేశారు. ఏఏపీలో నిర్ణయాత్మక మేథోమథనం జరుగుతోందని చెప్పారు. భావాల విషయంలో ఈ క్లాష్ నెలకొందని చెప్పారు.
ఏఏపీ కీలక నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లను రాజకీయ వ్యవహారాల కమిటీ నుండి తొలగించవచ్చుననే ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను గద్దె దించేందుకు కుట్ర పన్నుతున్నారని ఢిల్లీ ఏఏపీ కార్యదర్శి దిలీప్ పాండే ఆరోపించారు.
మరోవైపు పార్టీలోని లోపాలను పేర్కొంటూ అంతర్గత లోక్ పాల్ రాజకీయ సలహా సంఘానికి ఓ లేఖ రాసింది. అందులో కేజ్రీవాల్ పాత్రతో పాటు ఇద్దరు అగ్రనేతలు వర్గాలుగా చీలిపోవడాన్ని ఎత్తి చూపింది. ఒకరికి ఒకే పదవి అన్న దానిపై పార్టీ పరిశీలించాలని పేర్కొంది.
విభేదాలపై యోగేంద్ర యాదవ్
ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలు అంటూ వచ్చిన వార్తల పైన యోగేంద్ర యాదవ్ స్పందించారు. విభేదాలు వార్తలు వింటే నవ్వొస్తోందని చెప్పారు. ఓటర్లు తమ పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చారని, అలాంటి వారి కోసం విశాల హృదయంతో పని చేయాల్సి ఉందని యోగేంద్ర యాదవ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ దేశం తమ పైన ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు. తమ చిన్న చిన్న వాటి కోసం ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయమన్నారు.