ఆ పరిస్థితే వస్తే..కాశ్మీర్ ను మళ్లీ రాష్ట్రంగా మారుస్తాం: నిండు సభలో అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్, లడక్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. తన శైలికి భిన్నంగా వారిపై విరుచుకు పడ్డారు. ప్రతిపక్షాలు మత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని వారికి సున్నితంగా మందలించారు. మత రాజకీయాలకు తాము, తమ పార్టీ ఎప్పటికీ దూరంగానే ఉంటుందని, వాటిపై తమకు ఏ మాత్రం విశ్వాసం లేదని ఎదురుదాడికి దిగారు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ ముగిసిన అనంతరం అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం కాస్తా.. ప్రతిపక్షాలకు కాక పుట్టించింది.
ఆ పరిస్థితి వస్తే..మళ్లీ రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్..
జమ్మూ కాశ్మీర్ ను ఎంతకాలం కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగింపజేస్తారని అంటూ ప్రతిపక్ష సభ్యులు తనను అడుగుతున్నారని అమిత్ షా అన్నారు. `దీనికి తాను ఇచ్చే సమాధానం ఒక్కటే- ఆ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని నిండు సభ సాక్షిగా హామీ ఇస్తున్నా..` అని చెప్పారు. అలాంటి పరిస్థితులు త్వరలోనే రావాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాలు చెల్లవ్
ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష సభ్యులు గులాం నబీ ఆజాద్, డెరెక్ ఓబ్రియన్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. జమ్మూ కాశ్మీర్ లో ముస్లింలో మాత్రమే నివసిస్తున్నారని అనుకుంటున్నారా? అంటూ ధ్వజమెత్తారు. ఈ దేశానికి, ప్రజలకు, పౌర సమాజానికి ఏం చెప్పదలచుకున్నారని నిలదీశారు. జమ్మూ కాశ్మీర్ లో నివసిస్తున్నది ఒక్క ముస్లింలు మాత్రమే కాదని, హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు ఆది నుంచీ ఉంటున్నారని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ఏ ఒక్కరికో మేలు కలిగించేది కాదని చెప్పారు. ప్రతి ఒక్కరు దీనివల్ల లబ్ది పొందగలరని చెప్పారు. మత రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలంటే ఏమిటని ప్రశ్నించారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఎ వల్ల జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఎలాంటి మేలు కలగలేదని, దీనివల్ల అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని అన్నారు. ఫలితంగా జమ్మూ కాశ్మీర్ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేకపోయిందని చెప్పారు.
కనీసం ఆసుపత్రులైనా ఉన్నాయా?
జమ్మూ కాశ్మీర్ లో కనీసం ఆసుపత్రులైనా లేని పరిస్థితులు నెలకొన్నాయని అమిత్ షా అన్నారు. ఆయుష్మాన్ భారత్ వంటి అద్భుతమైన పథకాన్ని తాము ప్రవేశపెట్టామని, దాన్ని సమర్థవంతంగా అమలు చేయదగ్గ ఆసుపత్రులు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయా?, రోగులకు సరిపడేలా డాక్టర్లు, నర్సులు ఉన్నారా? అని ఆయన ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఏ డాక్టర్ అయినా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నారా? అని, 35 ఎ ఆర్టికల్ ను సమర్థించే వారు ఈ ప్రశ్నకు బదులివ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆర్టికల్ వల్ల పేరున్న ఏ డాక్టర్ అయినా జమ్మూ కాశ్మీర్ లో స్థిరనివాసం ఏర్పరచుకునే అవకాశం లేదని, అతని పిల్లలకు ఓటు హక్కు కూడా లభించదని అన్నారు. కాశ్మీర్ కు చెందిన అమ్మాయి ఏ ఒడిశాకు చెందిన యువకుడినో పెళ్లాడితే.. వారి పిల్లలకు జమ్మూ కాశ్మీర్ లో నివసించే హక్కు లభిస్తుందా? అని అమిత్ షా ప్రశ్నించారు. ఎలాంటి చట్టాలు ఆ రాష్ట్రంలో పనిచేయట్లేదని అన్నారు.
ఇంకా 18వ శతాబ్దంలోనే జీవించాలని కోరుకుంటున్నారా?
ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్ లో రక్తపాతం చోటు చేసుకుంటుందని ప్రతిపక్షాలు నిండు సభలో నిల్చుని చెబుతున్నాయని, ఈ ప్రకటన వల్ల వారు ఈ సమాజానికి ఎలాంటి హింసాత్మక సందేశాన్ని ఇస్తున్నారని అన్నారు. హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇంకా 18వ శతాబ్దంలోనే జీవించాలని ప్రతిపక్షాల నాయకులు కోరుకుంటున్నట్టున్నారని అమిత్ షా అన్నారు. ఇది 21వ శతాబ్దం అనే విషయాన్ని విస్మరించారని చెప్పారు. 21వ శతాబ్దంలో స్వేచ్ఛగా జీవించే హక్కు కాశ్మీరీలకు ఉందని చెప్పారు. రక్తపాతం అంటూ రెచ్చగొడుతున్న కాశ్మీర్ నుంచి వచ్చిన ప్రతిపక్ష నేతల పిల్లలు అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో చదువుకోవట్లేదా? అని నిలదీశారు.
ఆర్టికల్ 370 రద్దు అంశం అరిగేది కాదు.. తరిగేదీ కాదు..
ఆర్టికల్ 370 రద్దు అంశం 70 సంవత్సరాలుగా నానుతూ వస్తోందని గుర్తు చేశారు. దీన్ని ఇలాగే నానపెట్టడం వల్ల కాలగర్భంలో కలిసిపోతుందని, దీన్ని అందరూ విస్మరిస్తారని ప్రతిపక్ష నాయకులు భావించినట్టున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నిరోజులైనా, ఎంత కాలమైనా ఈ అంశం అరిగేది కాదు.. తరిగేదీ కాదని అన్నారు. 70 సంవత్సరాలుగా దీన్ని తాము భద్ర పరుస్తూ వచ్చామని చెప్పారు. ఇదొక తాత్కాలిక అంశంగా భ్రమించారని, 70 ఏళ్లుగా చెక్కు చెదరకుండా వస్తోన్న ఆర్టికల్ 70 రద్దు అంశం తాత్కాలికంగా పరిగణించగలమా? అని ప్రశ్నించారు.