ప్రాథమిక హక్కులను ఎలా ఉల్లంఘిస్తారు..కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న,ఇంటర్నెట్ సేవలపై ఇలా..!
జమ్మూ కశ్మీర్లో కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అక్కడ ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు కేంద్రం చెప్పినప్పటికీ దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. పిటిషన్ను శుక్రవారం విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇంటర్నెట్ వినియోగం అనేది ఒక ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి తూట్లు పొడుస్తారా అంటూ ప్రశ్నించింది. అంతేకాదు వెంటనే జమ్మూకశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని పాలనావర్గానికి సూచించింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా అధికారం చెలాయించరాదని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.
పిటిషన్ను విచారణ చేసిన జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది. పరిమితి దాటి ఆంక్షలు విధించడం ఆమోదయోగ్యం కాదని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఎలాంటి ఆప్షన్ లేనప్పుడు మాత్రమే ఆంక్షలు విధింపుపై ఆలోచన చేయాలని అదికూడా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం టెలికాం నిబంధనలకు విరుద్ధమని న్యాయస్థానం పేర్కొంది. ఒక గడువు వరకు సరైన కారణాలతో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయొచ్చని ఎలాంటి గడువు లేకుండా నిరవధికంగా సేవలను ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించింది.
ఇక ఇంటర్నెట్ అనే కాదు.. జమ్మూ కశ్మీర్లో ఉన్న అన్ని ఆంక్షలపై ఒకసారి పునఃసమీక్షించాలని .. ఎలాంటి ఆంక్షలు విధించారో అది పబ్లిక్ డొమెయిన్లో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ఇలాంటి ఆదేశాల ద్వారా ఎవరికైనా ఏమైనా నష్టం వాటిల్లిందని భావిస్తే వారు నిరభ్యంతరంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అభిప్రాయ బేధాలను అణగదొక్కేందుకు సెక్షన్ 144 అస్త్రం ఉపయోగించరాదని చెప్పిన సుప్రీంకోర్టు.... సెక్షన్ 144ను అమలు చేసేందుకు దారితీసిన పరిణామాలను కోర్టుకు సమర్పించాలని సూచించింది.
జమ్మూ కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్ దాఖలు చేసిన పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా భాసిన్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. అన్ని పిటిషన్లను ఒకేసారి విచారణ చేసింది అత్యున్నత న్యాయస్థానం .