నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు- ఎప్పుడైనా, ఎక్కడైనా చేస్తామంటే కుదరదని స్పష్టీకరణ
భారత్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్న వేళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశంలో నిరసనలు తెలిపే హక్కుపై చర్చకు తావిచ్చేలా ఉంది. దేశంలో నిరసనలు తెలిపే హక్కు కొన్ని పరిమితులకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2019 నాటి షహీన్ బాగ్ నిరసనలపై దాఖలైన రివ్యూ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
దేశంలో ప్రస్తుతం పౌరులు తమ హక్కుగా భావిస్తున్న నిరసనలు తెలిపే హక్కు అపరిమితం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశంలో కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా 2019లో ఢిల్లీలోని షహీన్బాగ్లో జరిగిన నిరసనలపై గతంలో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు దేశంలో నిరసనలు తెలిపే హక్కుకూ పరిమితులు ఉన్నాయని స్పష్టం చేసింది. ఎప్పుడైనా, ఎక్కడైనా నిరసనలు చేస్తామంటే కుదరదని స్పష్టం చేసింది.
షహీన్ బాగ్లో నిరసనలు చట్ట వ్యతిరేకం అంటూ సుప్రీంకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పుపై 12 మంది సామాజిక కార్యకర్తలు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. ఏదైనా అంశంపై విభేదించినప్పుడు వెంటనే నిరసనలకు దిగడంలో తప్పు లేదని, కానీ బహిరంగ స్ధలాలను ఆక్రమించుకుని సుదీర్ఘంగా నిరసనలు చేపట్టడం మాత్రం సరికాదని తెలిపింది. ఇది ఇతరుల హక్కులకు కూడా భంగం కలిగించడమే అని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ కృష్ణ మురారీతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.