జియో ఎఫెక్ట్: దూసుకెళ్తున్న రిలయన్స్ షేర్లు: తొలిసారి రూ.5లక్షల కోట్లు క్రాస్
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకెళ్తున్నాయి. రిలయన్స్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొట్టమొదటిసారిగా సోమవారం ట్రేడింగ్లో రూ. 5లక్షల కోట్ల మార్కును దాటేసింది.
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకెళ్తున్నాయి. రిలయన్స్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొట్టమొదటిసారిగా సోమవారం ట్రేడింగ్లో రూ. 5లక్షల కోట్ల మార్కును దాటేసింది. గత సెప్టెంబర్లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పేరు మీద ఈ కంపెనీ టెలికాం మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచీ షేర్లు తిరుగులేకుండా దూసుకెళ్తున్నాయి.
గరిష్టస్థాయికి..
సోమవారం ట్రేడింగ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1.49శాతం పెరిగి, రూ.1,553.90 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ పెరుగదలతో మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ. 5,05,287 కోట్లకు పెరిగింది. రూ.1534.30 వద్ద ప్రారంభమైన కంపెనీ షేర్లు రూ. 1,558.80 వద్ద గరిష్ట స్థాయిని తాకాయి.
52వారాల్లో 52శాతం వృద్ధి..
అంతేగాక, 52 వారాల్లో 52శాతం వృద్ధిని కూడా కంపెనీ షేర్లు నమోదు చేశాయి. ఈ పెరుగులతో బ్లూచిప్ కంపెనీల్లో అత్యధిక వెయిటేజీ ఉన్న షేర్లుగా ఇవి నమోదవుతుండటం గమనార్హం. దీంతో పెట్టుబడిదారులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా టెలికాం, పెట్రోకెమికల్స్, రిటైల్ బిజినెస్ల పెట్టుబడులు వీటికి బాగా సహకరిస్తున్నాయి.
జియో ఎఫెక్ట్
ఇప్పుడు జియో ఆఫర్ చేస్తున్న ధన్ ధనా ఆఫర్ ముగుస్తున్న క్రమంలో కంపెనీ టారిఫ్ ప్లాన్లను సవరించింది. కొత్తగా రూ. 309 ప్లాన్ లో తక్కువ వ్యాలిడిటీ డేటాను అందిస్తోంది. దీంతో కంపెనీ తన లాభాలను మెరుగుపర్చుకోవడానికి ఒక్కో యూజర్పై ఆర్జించే కనీస రెవెన్యూలను పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుం ఈ కంపెనీకి 120 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
శుభ సూచకమే..
జియో ప్లాన్లను సవరించడంతో అది టెలికాం ఇండస్ట్రీకి శుభసూచకంగా మారింది. జియో తన డేటా ప్లాన్లను పెంచుకుంటూ పోవడంతో ఇతర టెలికాం కంపెనీలు ఊపిరీపీల్చుకున్నాయి. కాగా, దీర్ఘ కాలికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో చాలా పాజిటివ్ వాతావరణాన్ని చూస్తున్నామని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. జియో వల్ల మరింత మార్కెట్ షేర్ పొందే అవకాశం ఉందని కొటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్-పీసీజీ రీసెర్చ్ సంజీవ్ బార్ బాడే తెలిపారు.