ఫ్రీడమ్251 స్మార్ట్ ఫోన్లో విఫలమైతే అంతే, కేంద్రం షాక్
న్యూఢిల్లీ: రూ.251కే స్మార్ట్ ఫోన్ ఇస్తామని చెప్పిన రింగింగ్ బెల్స్.. దానిని అమలు చేయకుంటే కఠినచర్యలు ఉండనున్నాయి. ఈ విషయమై కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ మంగళవారం నాడు స్పందించారు. మొబైల్ తయారీ కంపెనీ రింగింగ్బెల్స్ పైన కన్నేసి ఉంచామన్నారు.
ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ఫోన్ను విడుదల చేసిన ఈ కంపెనీ చౌక హ్యాండ్సెట్లను పంపిణీ చేయడంలో విఫలమైతే చర్యలకు వెనుకాడబోమన్నారు. వారు పంపిణీ విషయంలో ఎలా సన్నద్ధమయ్యారన్నదానిపై వాకబు చేస్తోందని, రూ.251 ధరకు ఫోన్లను అందించగలదా లేదా అని పరిశీలిస్తోందన్నారు.
వారికి బీఐఎస్ సర్టిఫికేట్ ఉందా లేదా అన్న విషయాన్ని చూస్తామని చెప్పారు. మా శాఖ ఆ కంపెనీపై ఓ కన్నేసి ఉంచిందని తెలిపారు. కాగా, తయారీ వ్యయం రూ.2500 అయినప్పటికీ విక్రయాల పరిమాణం, వినూత్న మార్కెటింగ్, సుంకాల్లో తగ్గింపులు, ఇ-కామర్స్ తదితరాల వల్ల ఆ లోటును పూడ్చుకుంటామని కంపెనీ చెప్పింది.
తమకు రూ.220 మాత్రమే ఖర్చు అవుతుందని, తమకు రూ.220 లాభం వస్తుందని రింగింగ్ బెల్స్ యజమాని గోయల్ ఇటీవల చెప్పారు. వివాదాల మధ్య కూడా ఫ్రీడమ్ 251 ఫోన్ను రెండు రోజుల్లో ఆరు కోట్ల మంది ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకోవడం గమనార్హం.