Riots: ఇరు వర్గాల గొడవలు, ఇద్దరు హత్య, లవ్ మ్యారేజ్, విగ్రహం విషయంలో ? నిషేధాజ్ఞలు !
బెంగళూరు/కోప్పళ: ఆ ఊరిలో రెండు వర్గాల మద్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. ఇరు వర్గాల పెద్దలు, పోలీసులు రాజీ చెయ్యడంతో ఇంతకాలం ఇరు వర్గాల ప్రజలు చూసిచూడనట్లు వెళ్లిపోతున్నారు. అయితే మతాంతర వివాహం, వాల్మీకి విగ్రహం ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మద్య గొడవ జరగడంతో ఇరు వర్గాలకు చెందిన ఇద్దరు దారుణ హత్యకు గురైనారు. మరో వ్యక్తి ఐసీయూలో చావుబతుల మద్య పోరాడుతున్నారు. లవ్ మ్యారేజ్ విషయంలో మొదలైన గొడవలు తరువాత విగ్రహం ఏర్పాటు చేసే విషయంలో గొడవపపడి ఇంతవరకు తెచ్చుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.
చాల ఏళ్ల నుంచి గొడవలు
కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని కనకగురి తాలుకాలో హులిహైదర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో హిందువులు, ముస్లీం సోదరులు నివాసం ఉంటున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి హిందువులు, ముస్లీంల మద్య గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరిగిన ప్రతిసారి ఇరు వర్గాల పెద్దలు, పోలీసులు రాజీ చెయ్యడంతో ఇంతకాలం ఇరు వర్గాల ప్రజలు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
లవ్ మ్యారేజ్.... వాల్మీకి విగ్రహం కోసం !
ఇటీవల ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న ముస్లీం, హిందూ యువతి, యువకుడు ప్రేమించుకుని గ్రామం నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ప్రేమికుల విషయంలో గ్రామంలో నివాసం ఉంటున్న ఇరు వర్గాల వారు ఒకరిని చూస్తే ఒకరు రగిలిపోతున్నారు. ఇదే సందర్బంలో గ్రామంలో వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేసే విషయంలో ఇరు వర్గాల మద్య గొడవలు మొదలైనాయి.
ఇద్దరి దారుణ హత్య
గురువారం గ్రామంలోని మార్కెట్ దగ్గరకు పాషావలి (27) అనే యువకుడు వెళ్లిన సందర్బంలో అక్కడ గొడవ మొదలైయ్యింది. అంతే ఇరు వర్గాల మద్య గొడవలు జరగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారిపోయింది. ఈ గొడవల్లో పాషావలితో పాటు యంకప్ప తళవార (60) అనే ఆయన హత్యకు గురైనారు.
ఉద్రిక్త పరిస్థితులు..... నిషేధాజ్ఞలు
గ్రామంలో ఇరు వర్గాల ప్రజలు కర్రలు, ఇనుపరాడ్లతో దాడులు చేసుకున్నారు. ఇద్దరు హత్యకు గురికావడంతో ధర్మన్న హరిజన అనే వ్యక్తికి తీవ్రగాయాలై ఐసీయూలో చావుబతుకుల మద్య పోరాడుతున్నారు. విషయం తెలుసుకున్న వందలాది మంది పోలీసులు హులిహైదర్ గ్రామం చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతరులను గ్రామంలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీ వరకు హులి హైదర్ గ్రామంలో నిషేధాజ్ఞలు విధించారు.