నగరాల్లో పెరిగిపోతున్న కోవిడ్ కేసులు ఏపీలో పరిస్థితేంటి.. ఎన్నికేసులకు ఎన్ని పడకలున్నాయి.?
న్యూఢిల్లీ: కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. ఇక భారత్లో కూడా రోజురోజుకూ కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లోని పెద్ద నగరాల్లోనే ఇప్పటి వరకు కరోనావైరస్ కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అతిపెద్ద నగరాల్లో 16శాతం నుంచి 28శాతం మేరా యాక్టివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇది ఆందోళన కలింగించే విషయం. ఎందుకంటే ఈ నగరాల్లో అత్యధిక ఆరోగ్య సిబ్బందితో పాటు మంచి చికిత్స కోసం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అందుబాటులో ఉంది. అయినప్పటికీ ఇక్కడ కేసులు మాత్రం తగ్గడం లేదు.
పెద్ద నగరాల్లో ఎక్కువ కేసులు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 72.7శాతం యాక్టివ్ కేసులు గ్రేటర్ కోల్కతా ప్రాంతంలోనే నమోదవుతున్నాయి. అంతేకాదు హౌరా హూగ్లీ ప్రాంతంలో కూడా అంతే స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇక రాష్ట్రంలో 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా ఏడు మెడికల్ కాలేజీలు కోల్కతా నగరంలోనే ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో కూడా 65.4 శాతం కేసులు గ్రేటర్ ముంబై, పూణే, నాగ్పూర్ల నుంచే నమోదవుతుండగా గుజరాత్లో 67శాతం కేసులు అహ్మదాబాదు, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్కోట్ల నుంచి నమోదవుతున్నాయి.
నగరాల్లోనే ఎక్కువగా డాక్టర్లు, హాస్పిటల్స్
దేశంలో 80శాతం మంది డాక్టర్లు 60శాతం హాస్పిటల్స్ పట్టణం లేదా నగరప్రాంతాల్లోనే ఉన్నాయన్నది వాస్తవం. అలాంటప్పుడు కరోనాకేసులు ఇక్కడ తగ్గుముఖం పట్టకపోగా ఇంకా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అదే ఉత్తర్ ప్రదేశ్లో పరిస్థితిని గమినిస్తే 27శాతం యాక్టివ్ కేసులు లక్నో, కాన్పూర్, ఘజియాబాద్-నోయిడా, ఆగ్రా మరియు మీరట్లాంటి నగారాల్లో నమోదవుతున్నాయి. మిగతా కేసులన్నీ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. దీంతో అక్కడ ఆరోగ్య వ్యవస్థకు ఇది పెద్ద సవాలుగా మారింది. ఇక బీహార్లో 27.8శాతం యాక్టివ్ కరోనా పాజిటివ్ కేసులు పాట్నా, గయా, భగల్పూర్ మరియు ముజఫర్పూర్లలో నమోదయ్యాయి. అయితే చాలామంది వలస కూలీలు వివిధ రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతాలకు వచ్చినందున వారినుంచి వైరస్ వ్యాప్తి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక బీహార్లో ఆరోగ్యవ్యవస్థ మాత్రం అద్వానంగా ఉన్నట్లు సమాచారం. దీంతో అక్కడ చిన్న పట్టణాలు, గ్రామాల్లో కరోనా కేసులు విలయతాండవం చేసే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Recommended Video
ఏపీలో పరిస్థితి ఇలాగుంది..
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే నమోదవుతున్న కరోనా యాక్టివ్ కేసులకు పడకల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం మరియు విజయవాడలాంటి నగరాల్లో 16శాతం కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఒడిషాలో 25శాతం యాక్టివ్ కేసులు గంజాంలో నమోదుకాగా 21శాతం కేసులు కోర్దాలో నమోదయ్యాయి. కటక్లో 6శాతం కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కేరళ హిమాచల్ ప్రదేశ్లలో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ రాష్ట్రాల్లో పడకల లభ్యత బాగానే ఉంది. కేరళలో పడకలు లభిస్తున్న రేటు 8.6గా ఉండగా హిమాచల్ ప్రదేశ్లో 13.9గా ఉంది. మొత్తానికి ఇలాంటి కీలక సమయాల్లో ఆరోగ్యవ్యవస్థను ఆయా రాష్ట్రాలు మెరుగుపర్చకపోతే తీవ్ర నష్టం చవి చూడాల్సి వస్తుందని ఆరోగ్యశాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్ద నగరాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే అదే చిన్న పట్టణాల్లో అందునా వైద్యసదుపాయాలు తక్కువగా ఉన్న పట్టణాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.