ఆపరేషన్ ఆకర్ష్కు బ్రేక్... అసలుకే ఎసరు... బెంగాల్లో అలర్ట్ అయిన బీజేపీ...
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్ష్ను విజయంతంగా కొనసాగిస్తున్న బీజేపీ ఉన్నట్టుండి దానికి బ్రేక్ వేయాలని భావిస్తోంది. టీఎంసీ నుంచి బీజేపీకి వలసలు ఎక్కువవడంతో.. ఇది మొదటికే మోసం తెచ్చే ప్రమాదం ఉందని గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఇకపై సామూహిక చేరికలను అనుమతించబోమని ప్రకటించింది.
బీజేపీలో టీఎంసీ నేతల చేరికలు ఎక్కువవడంతో కాషాయ పార్టీ టీఎంసీ బీ టీమ్గా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి తోడు తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని బీజేపీ శ్రేణులు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సొంత పార్టీలోనే విభేదాలు తలెత్తే అవకాశం ఉండటంతో బీజేపీ ఈ నిర్ణయానికి వచ్చింది.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా మాట్లాడుతూ... 'క్లీన్ ఇమేజ్ లేని నేతలను బీజేపీలో చేర్చుకుని మా పార్టీని టీఎంసీ బీ టీమ్గా మార్చాలనుకోవట్లేదు. అవినీతిలో కూరుకుపోయినవారిని,నైతికత లేనివారిని మా పార్టీలో చేర్చుకోవాలనుకోవట్లేదు.' అని తెలిపారు. ఇప్పటినుంచి సామూహిక చేరికలు ఉండవని... చాలా సెలెక్టివ్గా మాత్రమే చేరికలు ఉంటాయని చెప్పారు.
పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ బీజేపీ నేత దీనిపై మాట్లాడుతూ... టీఎంసీ నేతల ఇబ్బడి ముబ్బడి చేరికలపై రాష్ట్ర బీజేపీ నేతల్లో అసంతృప్తి నెలకొందని చెప్పారు. చాలా జిల్లాల్లో బీజేపీ నేతలు ఈ చేరికల పట్ల అసహనంతో ఉన్నట్లు చెప్పారు. ఒకరకంగా ఇది పార్టీలో అంతర్గత విభేదాలకు తావిచ్చే అంశమని పేర్కొన్నారు.
నిన్న,మొన్నటిదాకా ఇతర పార్టీల నుంచి ఎవరొచ్చినా స్వాగతించిన బీజేపీ.. ఇకపై ఇందుకోసం పార్టీలో ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేసుకోనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కొంతమందిని ఒక కమిటీ లాగా ఏర్పాటు చేయనుంది. ఎవరైతే బీజేపీలో చేరాలనుకుంటున్నారో... ఆ నేతల ప్రొఫైల్ను ఈ కమిటీ పరిశీలిస్తుంది. అక్కడ గ్రీన్ సిగ్నల్ వస్తేనే పార్టీలోకి వారికి ఎంట్రీ ఉంటుంది.
బీజేపీ తాజా నిర్ణయంపై టీఎంసీ స్పందించింది. అసలు రాష్ట్రంలో బీజేపీకి సొంత నేతలే లేరని... అందుకే ఇతర పార్టీల నేతలను లాక్కుంటోందని విమర్శించింది. ఇప్పుడు బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువవడంతో చేరికలకు తలుపులు మూసేస్తున్నట్లు ప్రకటించిందని పేర్కొంది.
Recommended Video
కాగా,గతేడాది 2019 లోక్సభ ఎన్నికల నాటి నుంచి ఇప్పటివరకూ 18 మంది టీఎంసీ ఎమ్మెల్యేలను,ఒక ఎంపీని బీజేపీ తమవైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను,ఒక సీపీఐ(ఎం) ఎమ్మెల్యేను చేర్చుకుంది. ఇందులో సువెందు అధికారి మాత్రమే,రాజీవ్ బెనర్జీ మాత్రమే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.