భారత్లో ఐసీస్ పాగా.. నిర్థారించిన ఎన్ఐఏ
జమ్మూ : ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ భారత్లో క్రమంగా విస్తరిస్తోంది. జమ్ము కాశ్మీర్ కేంద్రంగా చాప కింద నీరులా కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ మేరకు జమ్మూ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ పేరుతో భారత్లో అడుగుపెట్టిన ఐసీస్ కార్యకలాపాలు విస్తరించి ప్రస్తుతం ఇస్లామిక్ స్టేట్ జమ్మూ కాశ్మీర్గా మారిందని ఎన్ఐఏ అందులో స్పష్టం చేసింది.
సాధారణ తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డ నలుగురు వ్యక్తుల విచారణలో ఐసీస్ కార్యకలాపాల గురించి వెలుగులోకి వచ్చింది. పట్టుబడ్డ నలుగురిలో ఒకరు స్టూడెంట్ కాగా.. మరొక వ్యాపారి ఉన్నాడు. 2018 నవంబర్లో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ శ్రీనగర్లోని టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ చెక్పోస్ట్ వద్ద వారిని అధికారులు ఆపి తనిఖీ చేసే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన ఉగ్రవాదులు భద్రతా బలగాలపై గ్రనేడ్ విసిరి పారియేందుకు ప్రయత్నించారు. అయితే ఎన్ఐఏ అధికారులు వారిని పట్టుకోవడంతో అసలు విషయం బయటపడింది.
ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న నలుగురిని తాహిర్ అహ్మద్ ఖాన్ (24), హారిస్ ముష్తాక్ ఖాన్ (25), ఆసిఫ్ సుహేల్ నడాఫ్ (22), ఆసిఫ్ మాజిద్ ఖాన్ (34)గా గుర్తించారు. వారిలో ముగ్గురిపై గతంలోనే కేసులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిందితుల్లో పెద్దవాడైన ఆసిఫ్ మజిద్పై గతంలో రాళ్లు రువ్విన కేసు ఉంది. ఇంగ్లీష్ లిటరేచర్ స్టూడెంట్ అయిన ముష్తాక్ చదువుకుంటున్న సమయంలోనే అదృశ్యమయ్యాడు. కొడుకు అదృశ్యానికి సంబంధించి అతని తండ్రి గతంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల జాడను ఎన్ఐఏ నిర్థారించిన నేపథ్యంలో జమ్ముకాశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి.