ఎంపీగా పోటీ చేయనున్న మాజీ సీఎం కుమారుడు రితేశ్ దేశ్ముఖ్, తండ్రి స్వస్థలం నుంచే
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత విలాస్ రావ్ దేశ్ముఖ్ కుమారుడు, ప్రముఖ బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ముఖ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు సమాచారం. 2019లో లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
తన తండ్రి స్వస్థలమైన మహారాష్ట్రలోని లాతూరు నియోజకవర్గం నుంచి రితేశ్ పోటీ చేయనున్నట్లు సమాచారం. కాగా, గతంలో రితేశ్ రాజకీయాలపై అంతగా ఆసక్తి చూపలేదు. తన తండ్రిలాగా తాను రాజకీయాల్లోకి రాలేనని గతంలో వ్యాఖ్యానించారు.
అయితే, లోకసభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయాల్లోకి రావడానికి ఇదే మంచి సమయమని రితేశ్ భావిస్తున్నట్లు తెలిసింది. కాగా, 1999 నుంచి 2008 వరకు విలాస్ రావ్ దేశ్ముఖ్ రెండుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
కాగా, కిడ్నీ, కాలేయ సమస్యతో బాధపడుతూ విలాస్ రావ్ 2012, ఆగస్టులో మృతి చెందారు. రితేశ్ ప్రముఖ సినీనటి జెనీలియాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్న రితేశ్ తన రాజకీయ అరంగేట్రంపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.