బీహార్ ఎన్నికల కౌంటింగ్లో అక్రమాలు... 10 స్థానాల్లో ఉద్దేశపూర్వకంగా... తేజస్వి సంచలన ఆరోపణలు...
బీహార్లో హోరాహోరీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు చివరికి ఎవరిని విజేతగా నిలుపుతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. గంట గంటకు ట్రెండ్ మారిపోతుండటంతో... తుది ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. కౌంటింగ్ మొదలైన కొద్దిగంటల వరకూ హోరాహోరీగా సాగిన పోరులో మధ్యాహ్నం వరకు బీజేపీ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. అయితే సాయంత్రానికి అనూహ్యంగా మళ్లీ ఆర్జేడీ పుంజుకోవడం... ఆ తర్వాత కొద్దిసేపటికే బీజేపీ తిరిగి ఆధిక్యాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. ఇప్పటికే 90శాతం ఓట్ల లెక్కింపు పూర్తయినట్లు ఈసీ ప్రకటించింది. మరోవైపు ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరుగుతున్నాయని ఆర్జేడీ ఆరోపిస్తుండటం గమనార్హం.
Recommended Video
సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని ఆరోపణలు...
తాజా ట్రెండ్స్ ప్రకారం... బిహార్లో ఎన్డీయే 124,మహాకూటమి 113 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇప్పటికే ఎన్డీయే మ్యాజిక్ ఫిగర్ దాటడంతో.. ఇదే ట్రెండ్ కొనసాగితే విజయం తథ్యం. అయితే ఇంకా 10శాతం ఓట్లు లెక్కించాల్సి ఉండటం... బీజేపీ ఆధిక్యంలో ఉన్నచోట స్వల్ప మెజారిటీ మాత్రమే ఉండటంతో... తుది ఫలితాన్ని అంచనా వేయడం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో ఆర్జేడీ ఓట్ల లెక్కింపుపై తీవ్ర ఆరోపణలు చేసింది. తమ అభ్యర్థులు గెలిచిన దాదాపు 10 చోట్ల ఎన్నికల కమిషన్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా జాప్యం చేస్తోందని ఆరోపించింది. ఓట్ల లెక్కింపులో నితీశ్ డైరెక్షన్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించింది.
అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని...
జిల్లా అధికార యంత్రాంగం,ఎన్నికల అధికారులపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఎన్నికల ఫలితాల్లో సీఎం మోదీ,బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ కుట్రలకు తెరలేపారని మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఆరోపించారు.సీఎం ఇంట్లో కూర్చుని నితీశ్తో కలిసి సుశీల్ కుమార్ మోదీ కుయుక్తులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మార్జిన్ తక్కువగా ఉన్న చోట ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చి... ఫలితాలను వారికి అనుకూలంగా మలుచుకునే కుట్ర జరుగుతోందన్నారు. ఈ మేరకు మంగళవారం(నవంబర్ 10) సాయంత్రం తేజస్వి హిందీలో ట్వీట్ చేశారు.
గెలిచారని ప్రకటించి... అంతలోనే...
ఇప్పటివరకూ తాము 119 స్థానాల్లో గెలుపొందినట్లు ఆర్జేడీ ప్రకటించుకుంది. గెలిచిన తమ అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు కూడా అభినందనలు తెలిపారని... కానీ 10 చోట్ల తమ అభ్యర్థులకు ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వలేదని ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగానే వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేదని... ఇదేంటని అడిగితే ఓడిపోయారని చెప్తున్నారని పేర్కొంది. గెలిచినట్లుగా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో వారి పేర్లు కూడా ప్రకటించారని... మళ్లీ ఇంతలోనే ఓడిపోయారని చెప్తూ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఆరోపించింది. ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్యంలో సరికాదని వ్యాఖ్యానించింది.
తాజా ట్రెండ్స్...
ఇప్పటివరకూ అందుతున్న ట్రెండ్స్ ప్రకారం బిహార్లో ఎన్డీయే 123,మహాకూటమి 113,ఇతరులు 7 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. అనూహ్యంగా ఎంఐఎం రెండు స్థానాల్లో గెలవడమే గాక.. మరో మూడు చోట్ల లీడ్లో ఉంది. లోక్ జనశక్తి పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకోగలిగింది. అయితే ఆ పార్టీ ఓట్లను చీల్చడంతో జేడీయూకి భారీ నష్టమే జరిగింది. ఇప్పటివరకూ అందిన ఫలితాల ప్రకారం జేడీయూ కేవలం 44 స్థానాలకే పరిమితమైంది. మరో 5 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.