క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం: బీహార్ ఫలితాల ఒత్తిడే కారణమట!
పాట్నా: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు చెబుతున్నారు. నవంబర్ 10న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో లాలూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని వెల్లడించారు.
లాలూ ప్రసాద్ను వెంటాడుతోన్న దుమ్కా ట్రెజరీ కేసు: జైలు జీవితమే: అనారోగ్యంలోనూ
లాలూకు డయాలసిస్ పెట్టే పరిస్థితి..
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ కొంత క్షీణించిందని, మరింత విషమిస్తే డయాలసిస్ చేస్తామని వైద్యులు సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపారు. దాణా కుంభకోణం కేసులు దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్ 2017 నుంచి జైలులోనే ఉన్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కొంతకాలంగా రాంచీలోని రిమ్స్లో చికిత్స తీసుకుంటున్నారు. లాలూ దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని, అయినప్పటికీ ఇప్పటి వరకు ఆయనకు డయాలసిస్ చేయాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కానీ, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు.
బీహార్ ఎన్నికలపై లాలూ ఎప్పటికప్పుడు..
ఇది ఇలావుంటే, ఇటీవల బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. లాలూ కుమారుడు, ఆర్జేడీ నేత మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో లాలూ ఎన్నికల ప్రచారం, పరిస్థితులపై ఎప్పటికప్పుడు తెలుసుకునేవారని వైద్యులు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా ఆయన పరిశీలించారు.
Recommended Video
లాలూపై ఎన్నికల ఫలితాల ఒత్తిడి..
ఆర్జేడీ మహాకూటమికే అధికారం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చడంతో ఆ పార్టీ, కూటమిలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. అయితే, మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో లాలూ కొంత ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ రాష్ట్రంలో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏ, మహాకూటమి మధ్యే కీలక పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆర్జేడీ కూటమికే జైకొట్టినప్పటికీ.. అసలు ఫలితాలు మంగళవారం రానుండటంతో కొంత ఉత్కంఠ నెలకొంది.