బీహార్లో హంగ్: బీజేపీ-ఆర్జేడీ పొత్తుపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు - నితీశ్కు ఆప్షన్ లేదన్న రవిశంకర్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ మధ్య నెలకొన్న నాటకం రోజుకో మలుపు తిరుగుతోంది. సీఎం నీతీశ్ కుమార్ కు చెక్ పెట్టేలా బీజేపీ నేతలే చిరాగ్ పాశ్వాన్ వెనకుండి కథ నడిపిస్తున్నారని జేడీయూ నేతలు విమర్శిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ, ఎల్జేపీ నేతలు ఈ వాదనను తోసిపుచ్చుతున్నారు.
Recommended Video
ఫలితాలు అటుఇటయినా, హంగ ఏర్పడినా బీజేపీ-ఎల్జేపీతో కలవొచ్చని ఊహాగానాలు వెలువడుతోన్నవేళ.. జేడీయూ తిరిగి ఆర్జేడీతో కలుస్తుందనే అనుమానాలపై బీహార్ బీజేపీకే చెందిన సీనియర్ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో బీజేపీ-ఆర్జేడీ పొత్తు సంభావ్యతపైనా మాట్లాడారు. హైదరాబాద్ లోని రెస్టారెంట్లలో బీర్యానీ వండే బీహారీలను కూడా ప్రస్తావించారు. కేంద్ర మంత్రి కామెంట్లు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి..
బీజేపీకి బీహార్ సీఎం నితీశ్ షాకిచ్చారా? - లక్షల్లో ఉద్యోగాల హామీని పచ్చి బోగస్ అంటూ ఫైర్
ఫలితాల్లో హంగ్ ఏర్పడితే..
ప్రధాని నరేంద్ర మోదీ కమిట్మెంట్, సీఎం నితీశ్ కుమార్ హార్డ్ వర్క్ కారణంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఏకపక్ష విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ధీమా వ్యక్తం చేశాయి. అయితే, పొరపాటున ఫలితాల్లో హంగ్ ఏర్పడితే.. జేడీయూ.. బీజేపీని వీడి తిరిగి ఆర్జేడీతో జట్టుకట్టే అవకాశం లేదని, నితీశ్ కుమార్ స్వభావానికి ఆర్జేడీ అస్సలు పొసగదు కాబట్టి ఆయనకా ఆప్షన్ లేనట్లుగానే భావించాలని, గతంలో 18 నెలల కలయిక కూడా లుకలుకలతో సాగిందని రవిశంకర్ వ్యాఖ్యానించారు. ఫలితాల తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్ కనుమరుగైపోతాయని జోస్యం చెబుతూనే.. బీజేపీతో లాలూ పార్టీ పొత్తుపైనా ఆయన మాట్లాడారు..
ఆర్జేడీతో బీజేపీ కలుస్తుందా?
బీహార్ కు చెందిన చిరాగ్ పాశ్వాన్ సొంతగా పోటీ చేస్తుండటం వెనుక బీజేపీ హస్తం లేదని పదే పదే ఖరారు చేసినా ఆరోపణలు వస్తుండటం బాధాకరమని, ఎల్జేపీని ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోని పార్టీగా చూడరాదని కేంద్ర మంత్రి అన్నారు. అయితే, ఫలితాలను బట్టి బీజేపీ-ఎల్జేపీ పొత్తు పెట్టుకుంటాయా? లేదా? అనేదానిపై తాను ఇప్పుడే కామెంట్లు చేయబోనన్నారు. ఇక ఆర్జేడీ-బీజేపీ పొత్తుపై మాట్లాడుతూ.. ‘‘రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. గడిచిన 15 ఏళ్లలో బీహార్ లో అనూహ్య పొత్తులు ఏర్పడ్డాయి. కానీ, బీజేపీ-ఆర్జేడీ మాత్రం ఇప్పటిదాకా కలవలేదు. బహుశా కలవబోవు కూడా'' అని రవిశంకర్ వివరించారు.
నితీశ్ సర్కారుపై వ్యతిరేకత..
బీహార్ ఎన్నికల ప్రారంభంలో నితీశ్ సర్కారుపై వ్యతిరేకత ఉందనే భావన కనిపించిందని, అయితే, ప్రచారం సాగుతున్న కొద్దీ ఎన్డీఏకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రవిశంకర్ చెప్పారు. నితీశ్ కుమార్ సహా ఎన్డీఏ నేతల సభల్లో నిరసనలు వ్యక్తం అవుతుండటం కుట్రలో భాగమని కేంద్ర మంత్రి అన్నారు. 99 శాతం ప్రజలు ప్రసంగాలను శ్రద్ధగా వింటున్నారని, ఒకటిరెండు చోట్ల కొందరు కావాలనే అల్లరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తేజస్వీ యాదవ్ సభలకు జనం పెద్ద సంఖ్యలో హాజరవుతుండటంపై స్పందిస్తూ.. ‘‘గత లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కూడా మహాకూటమి సభలకు జనం విపరీతంగా వచ్చారు. కానీ వాళ్లకు ఒక్కటంటే ఒక్కటే సీటు దక్కింది. ఈసారి కూడా అదే జరుగుతుంది'' అని అన్నారు.
హైదరాబాద్ బిర్యానీ వద్దంటామా?
కరోనా లాక్ డౌన్ సమయంలో అత్యధికంగా బీహార్ కు చెందిన 40 లక్షల మంది వలసదారులు సొంత రాష్ట్రానికి తరలి వెళ్లడం, ఆ సమయంలో కేంద్రంలోని మోదీ, బీహార్ లోని నితీశ్ ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం తెలిసిందే. 100 ఏళ్లలో అతిపెద్ద విపత్తులా వచ్చిన కరోనా విషయంలో తాము సరిగానే పనిచేశామని కేంద్ర మంత్రి చెప్పారు. బీహార్ కు చేరిన 40 లక్షల వలసదారులకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తారా? అనే ప్రశ్నకు రవిశంకర్ తనదైన శైలిలో కౌంటరిచ్చారు. ‘‘వలసలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఆయా రంగాల్లో తన ప్రతిభను చాటుకునేందుకు బీహారీలు ఇతర ప్రాంతాలకు వెళ్లడాన్ని కాదనలేం. ఉదాహరణకు హైదరాబాద్ లోని రెస్టారెంట్లలో బిర్యానీ చేయడానికి వెళ్లే బీహారీ చెఫ్ లను వెళ్లొద్దని అనగలమా?'' అని ఎదురుప్రశ్నించారు.
షాకింగ్: 6నెలల్లో జగన్ 114 శాతం అప్పులు -కేసీఆర్తో చర్చలు -ఏపీ పోలీసులపైనా వైసీపీ ఎంపీ ఆరోపణలు