బీహార్ క్యాబినెట్ లో సుశీల్ మోడీకి స్థానం దక్కని కారణం ఇదే.. ఆర్జేడీ నేత షాకింగ్ కామెంట్స్
బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం మరోమారు బీహార్ లో పాలనా పగ్గాలు చేపట్టింది. నిన్న నితీష్ కుమార్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఆయనతో పాటు 14 మంది మంత్రులు పాట్నాలోని రాజ్ భవన్లో గవర్నర్ ఫాగు చౌహాన్ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మంత్రుల జాబితాలో అతి ముఖ్యమైన పేరు, నితీష్ కుమార్ కి డిప్యూటీ సీఎంగా ఎక్కువ కాలం పనిచేసిన సుశీల కుమార్ మోడీకి కేబినెట్లో స్థానం లేకపోవడం ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
రాహుల్ గాంధీ పిక్నిక్ ఎంజాయ్ చేశారు .. బీహార్ లో ఓటమికి కాంగ్రెస్ నే కారణమన్న ఆర్జేడీ
బీహార్ లో సుశీల్ కుమార్ మోడీకి క్యాబినెట్ లో నో ఛాన్స్
బిజెపికి చెందిన తార్కిషోర్ ప్రసాద్, రేణు దేవిలను ఇప్పుడు బీహార్ డిప్యూటీ సిఎంలుగా చేశారు. కొన్నేళ్లుగా బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపిన సుశీల్ మోడీ స్థానంలో నితీష్ కుమార్తో పాటు ఈసారి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను చేయాలని బిజెపి నిర్ణయించింది. అందులో భాగంగానే సుశీల్ కుమార్ మోడీ కి స్థానం ఇవ్వలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమం తరువాత మీడియాతో జరిపిన సంభాషణలో, ఈసారి సుశీల్ మోదీ ఎందుకు తప్పుకున్నారని నితీష్ ను అడగగా దీనిపై బీహార్ సిఎం స్పందిస్తూ,సుశీల్ మోడిని ఉప ముఖ్యమంత్రిగా నియమించకూడదనేది బిజెపి నిర్ణయం. దీని గురించి వారిని అడగాలి అని పేర్కొన్నారు.
సుశీల్ మోడీపై చర్చ ... స్పందిస్తూ ట్వీట్ చేసిన సుశీల్ మోడీ
బీహార్లో బీజేపీకి నాయకుడైన సుశీల్ కుమార్ మోడీకి త్వరలో కేంద్రంలో కీలక పదవి కేటాయించవచ్చు అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే సమయంలో తనకు బీహార్ క్యాబినెట్లో స్థానం కల్పించకపోవడం పై స్పందించిన సుశీల్ కుమార్ మోడీ బిజెపి మరియు సంఘపరివార్ సభ్యుడిగా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో తనకు చాలా ప్రాధాన్యత ఇచ్చారని, పార్టీ తనకు ఇచ్చే బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, తనను పార్టీ కార్యకర్త పదవి నుండి ఎవరు తొలగించలేరు అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు.
బీజేపీలో సుశీల్ మోడీకి ప్రాధాన్యం తగ్గిందన్న ఆర్జేడీ నేత శివానంద్ తివారీ
ఇదే సమయంలో సుశీల్ కుమార్ మోడీ కి డిప్యూటీ సీఎంగా పదవి లభించకపోవడం వెనుక వేరే కారణాలు ఉన్నాయని ఆర్జేడీ నేత శివానంద తివారీ పేర్కొన్నారు. సుశీల్ కుమార్ మోడీ బిజెపిలో ప్రాధాన్యత తగ్గి, నితీష్ బృందంలో ఒకడిగా మారారని, ఆయన పార్టీలోని ఇతర నేతలను ఎదగనివ్వకుండా, ఎప్పుడూ తనకు తానే ప్రచారం చేసుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేసిన శివానంద్ తివారీ అతడి ప్రవర్తన కారణంగానే బీజేపీ అతనికి కనీసం క్యాబినెట్ లో కూడా స్థానం ఇవ్వలేదని పేర్కొన్నారు.
Recommended Video
నితీష్ కు బాగా దగ్గరగా ఉండటం వల్లే సుశీల్ మోడీని తిరస్కరించిన బీజేపీ
సుశీల్ కుమార్ మోడీ తనకు తమ్ముడు తో సమానం అని, అతనితో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని శివానంద్ తివారి పేర్కొన్నారు. నితీష్ కు బాగా దగ్గర వ్యక్తిగా ఉండటం వల్లే సుశీల్ కుమార్ మోడీ ని పక్కన పెట్టారని శివానంద్ తివారీ వ్యాఖ్యానించారు. కేవలం బీజేపీ కారణంగానే ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని పేర్కొన్న శివానంద్ తివారీ, లేకుంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.