బీహార్లో నిరుద్యోగ యువతకు 10 లక్షల ఉద్యోగాలు : తేజస్వీ యాదవ్ హామీ: నామినేషన్ దాఖలు
పాట్నా: బీహార్లో రాజకీయాలు వేడెక్కాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ రఘుపూర్ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశాడు. రెండో దశ అంటే నవంబర్ 3వ తేదీన ఈ నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. నామినేషన్ వేసే సమయంలో అతని సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా తన వెంట ఉన్నాడు. హాజిపూర్ కలెక్టరేట్లో తేజస్వీ యాదవ్ నామినేషన్ దాఖలు చేశాడు.
మహాగట్భంధన్ తరపున తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. నామినేషన్కు ముందు మాట్లాడిన తేజస్వీ యాదవ్ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముందుగా 10 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇది అధికారంలోకి వచ్చిన తొలి క్యాబినెట్ భేటీలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలే అని శాశ్వత ప్రాతిపదికన నియామకాలు జరుగుతాయని తేజస్వీ చెప్పారు. ప్రజలు ప్రభుత్వం నుంచి కొత్త ఆలోచన విధానాన్ని కోరుకుంటున్నారని ఈ ఆర్జేడీ నేత చెప్పారు. బీహార్లో నిరుద్యోగ రేటు చాలా ఎక్కువగా ఉందని రెండు ఇంజిన్ల ప్రభుత్వం దీన్ని గుర్తించడం లేదంటూ జేడీయూ-బీజేపీ ప్రభుత్వాలపై తేజస్వీ యాదవ్ నిప్పులు చెరిగారు.
జేడీయూ - బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశాయని ఆవేదన వ్యక్తం చేసిన తేజస్వీ యాదవ్... నిరుద్యోగం, పేదరికం, ఆకలి చావులు, వలసలను పెంచేశాయని ధ్వజమెత్తారు. బీహార్లో నిరుద్యోగం 46.6శాతం ఉందని చెప్పిన తేజస్వీ యాదవ్... నితీష్ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. 15 ఏళ్లలో ఏమి చేసిందని ధ్వజమెత్తారు. ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తేజస్వీ యాదవ్... అసలు ధర్మాన్ని మరిచి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇక ఈ ఎన్నికల్లో తన తండ్రి లాలూ ప్రసాద్ దగ్గరుండి చూసుకో లేకపోవడం తమకు లోటుగానే ఉంటుందని చెప్పిన తేజస్వీ యాదవ్.. గత ఎన్నికల్లో లాలూపై ప్రజలు నమ్మకం ఉంచారు కాబట్టే ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కష్టపడాలని ప్రజల అభీష్టం మేరకు నడుచుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్ తనకు సూచించినట్లు చెప్పారు.
#WATCH Patna: RJD leader Tejashwi Yadav seeks blessings of his mother Rabri Devi and elder brother Tej Pratap Yadav. He'll file nomination from Raghopur today, for the upcoming #BiharElections2020.
— ANI (@ANI) October 14, 2020
Rabri Devi says, "People of Bihar and everyone in the party is missing Lalu ji." pic.twitter.com/VTCASwSZCo
Recommended Video
ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అనారోగ్యం కారణంగా రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతున్నారు. బీహార్లో 243 సీట్లకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మూడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో అక్టోబర్ 28న తొలి దశ, నవంబర్ 3న రెండో దశ, నవంబర్ 7న మూడో దశ ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.