అధికారిక నివాసంలో బాలికకు నరకం: నిర్బంధించి అత్యాచారం: పరారీలో ఎమ్మెల్యే..సెక్స్ రాకెట్!
పట్నా: తన అధికారిక నివాసంలో ఓ మైనర్ బాలికను ప్రత్యక్ష నరకాన్ని చూపించాడు ఓ శాసన సభ్యుడు. ఆ బాలికను నిర్బంధించి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. శాడిజాన్ని ప్రదర్శించాడు. అతని దారుణ కృత్యం వెలుగులోకి రావడంతో పరారయ్యాడు. ఆచూకీ లేకుండా పోయాడు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఛార్జిషీట్ను దాఖలు చేశారు. పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఆ ఎమ్మెల్యే పేరు అరుణ్ యాదవ్. రాష్ట్రీయ జనతాదళ్ సీనియర్ నాయకుడు. బిహార్లోని సందేశ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. రాజధాని పట్నాలోని తన అధికారిక నివాసంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు అరుణ్ యాదవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఛార్జిషీట్ను దాఖలు చేశారు. ప్రత్యేక పోక్సో న్యాయస్థానానికి ఈ ఛార్జిషీట్ను సమర్పించారు.
ఈ ఛార్జిషీట్లో పలు అంశాలను పొందుపరిచారు పోలీసులు. అరుణ్ యాదవ్ ఇదివరకు ఓ సెక్స్ రాకెట్ నిర్వహించారని పేర్కొన్నారు. మహిళల అక్రమ రవాణా, లైంగిక దాడులకు పాల్పడిన కేసులో ఆయనపై పలు కేసులు ఉన్నాయని వెల్లడించారు. ప్రస్తుతం అరుణ్ యాదవ్ పరారీలో ఉన్నారని, ఆయన కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేక బృందాలను నియమించినట్లు చెప్పారు.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వారం రోజుల తరువాత కూడా అరుణ్ యాదవ్ను అరెస్టు చేయలేకపోవడం పట్ల పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బిహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్, కార్యదర్శిలకు నోటీసులను సైతం జారీ చేశారు. అరుణ్ యాదవ్ వెంటనే న్యాయస్థానం ముందు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. న్యాయస్థానం సమక్షానికి హాజరు కాలేకపోతే.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేస్తామని వెల్లడించారు.