ఆర్జేడీలో పెరుగుతున్న అసమ్మతి సెగ...తేజస్వీ రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్
2019 లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న రాష్ట్రీయ జనతాదల్ పార్టీలో అసమ్మతి సెగ ప్రారంభమైంది. లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లినప్పటి నుంచి ఆ పార్టీలో కొంత వ్యతిరేక గళం వినిపిస్తోంది. తాజా ఓటమితో ప్రస్తుతం ఆ పార్టీని తన భుజాలపై మోస్తున్న లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ పై కొందరు పార్టీ నేతలే వ్యతిరేకంగా గళం విప్పారు. పార్టీ బాధ్యతల నుంచి తేజస్వీ యాదవ్ తప్పుకోవాలని ఓ వర్గం పట్టుబడుతోంది. ఆర్జేడీ ఎమ్మెల్యే మహేశ్వర యాదవ్ పార్టీ బాధ్యతల నుంచి తేజస్వీ యాదవ్ తప్పుకోవాలని ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గైఘాట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న మహేశ్వర యాదవ్ పార్టీని సొంత అవసరాలకు వాడుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఓటమి తర్వాత ఆర్జేడీ అధినాయకత్వంపై వ్యతిరేకంగా గళం విప్పిన వారిలో ఎమ్మెల్యే మహేశ్వర యాదవ్ ప్రథముడు. అంతేకాదు మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ ఛీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పై కూడా బహిరంగంగానే నిప్పులు చెరిగారు.
ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యంపై సమీక్ష మంగళవారం ఉండగా అంతకంటే ఒక్క రోజు ముందే అంటే సోమవారమే మహేశ్వర యాదవ్ వ్యతిరేక జెంగా ఎగురవేయడంపై పార్టీని డిఫెన్స్లోకి నెట్టేసింది. ఒక్క సీటు కూడా గెలవకపోవడం అనేది ఆర్జేడీ చరిత్రలో తొలిసారిగా జరిగిందని అన్నారు మహేశ్వర్ యాదవ్. యాదవుల కంచుకోటలో కూడా ఆర్జేడీ దారుణంగా వైఫల్యం చెందింది. 2014లో ఆర్జేడీ కేవలం 4 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 40 స్థానాలకు గాను 39 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఒక్క కిషన్గంజ్ స్థానం మాత్రమే గెలుచుకుంది.