బీజేపీ, జేడీయూ మధ్య పెరిగిన దూరం.. నితీశ్కు ఆర్జేడీ గాలం..
పాట్నా : సార్వత్రిక ఎన్నికల్లో బీహార్లో బీజేపీతో కలిసి మెజార్టీ సీట్లు సంపాదించిన నితీశ్ కుమార్ కేబినెట్ పదవుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తేలేదంటున్నారు. కేవలం ఒక్క మంత్రిపదవి ఇవ్వడంపై అలకబూనిన ఆయన.. బీజేపీపై మాటల తూటాలు పేలుస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. ఇదే అదునుగా నితీశ్ను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. జేడీయూతో మళ్లీ పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపింది.
ఉప ఎన్నికల్లో ఒంటరి పోరు... కూటమితో తెగదెంపులు తాత్కాలికమేనన్న బెహన్ జీ..
నితీశ్తో కలిసి పనిచేసేందుకు సిద్ధం
లాలూ సతీమణి, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవీ సీఎం నితీశ్ కుమార్తో కలిసి పనిచేసేందుకు సిద్దమని ప్రకటించారు. ఆయన కోసం ఆర్జేడీ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని అన్నారు. నితీశ్ మహాకూటమిలో చేరదలిస్తే తమకు ఎలాంట అభ్యంతరం లేదని రబ్రీదేవీ స్పష్టం చేశారు. మరోవైపు ఆర్జేడీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింద్ సైతం ఈ అంశంపై స్పందించారు. సీఎం నితీశ్ కుమార్ మహాఘట్బంధన్లోకి తిరిగి రావడమే ఆయన ముందున్న సరైన నిర్ణయమని అన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చన్న ఆయన.. ఇప్పటికీ తాము నితీశ్కు మద్దతిస్తున్నట్లు చెప్పారు.
గత ఎన్నికల్లో కలిసి పోటీ
బీహార్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ నేతృత్వంలోని జేడీయూ, లాలూ చీఫ్గా ఉన్న ఆర్జేడీలు కలిసి పోటీ చేశాయి. బంపర్ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే 2017 జులైలో దాణా కుంభకోణంలో లాలూ జైలు పాలవడంతో కూటమి విచ్ఛిన్నమైంది. ఆర్జేడీతో బంధం తెంచుకున్న జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఎన్డీఏలో చేరారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 17 సీట్లలో పోటీచేసిన జేడీయూ 16 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే మోడీ కేబినెట్లో కేవలం ఒకే ఒక్క బెర్త్ ఇవ్వడంతో అలిగిన నితీశ్ బీజేపీతో దూరం పాటిస్తున్నారు.
ఇఫ్తార్ విందుకు నేతల డుమ్మా
తాజా పరిణామాల నేపథ్యంలో బీహార్లో బీజేపీ, జేడీయూల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. జేడీయూ హజ్ భవన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఒక్క బీజేపీ నేత కూడా హాజరుకాలేదు. మరోవైపు డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు జేడీయూ నేతలు డుమ్మా కొట్టారు.