భవిష్యత్తులో బాలాకోట్ తరహా దాడులు: ఐఏఎఫ్ కొత్త బాస్ ఆర్కే భదౌరియా
న్యూఢిల్లీ: భారత వాయుసేన దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. ఎయిర్ మార్షల్ బీఎస్ దనోవా ఎయిర్ చీఫ్గా పదవీవిరమణ పొందడంతో ఆయన స్థానంలో ఆర్కే భదౌరియా బాధ్యతలు చేపట్టారు. బీఎస్ దనోవా హయాంలో ఎలాగైతే బాలాకోట్ దాడులు జరిగాయో భవిష్యత్తులో కూడా అలాంటి దాడులకు సిద్ధంగా ఉండాలని కొత్త బాస్ ఆర్కే భదౌరియా పిలుపునిచ్చారు. శతృదేశం నుంచి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సత్తా ఇండియన్ ఎయిర్ఫోర్స్కు ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
బాలాకోట్ తరహా దాడులకు సిద్ధంగా ఉండండి
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన ఆర్కే భదౌరియా మీడియాతో మాట్లాడారు. బాలాకోట్ దాడులకు ప్రిపేర్ అయ్యే ప్రణాళికను అమలు చేశామని, భవిష్యత్తులో జరిగే దాడులకు కూడా ఇప్పుడే సిద్ధంగా ఉంటున్నామని చెప్పారు. ఏ సవాళ్లనైనా ఎదుర్కొనే సత్తా సామర్థ్యం భారత వాయుసేనకు ఉందని చెప్పారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి తమకు పూర్తిగా సమాచారం ఉందని సరైన సమయంలో సరైన దాడులకు శతృదేశంపై దిగుతామని ఆయన వెల్లడించారు.
గేమ్ ఛేంజర్గా రాఫేల్ యుద్ధ విమానాలు
ఇక భారత వాయుసేనలోకి రాఫేల్ యుద్ధ విమానాలు చేరుతున్నాయని వీటి చేరికతో ఇండియన్ ఎయిర్ఫోర్స మరింత బలోపేతంగా తయారవుతుందని చెప్పారు ఆర్కే భదౌరియా. భారత వాయుసేన బలోపేతం, బడ్జెట్లోనే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాలను సమకూర్చుకోవడం తన తొలి ప్రాధాన్యత అని చెప్పారు. అంతేకాదు రాఫెల్ ఒక గేమ్ చేంజర్ అవుతుందని అభిప్రాయపడ్డారు. చైనా పాకిస్తాన్ల కంటే భారత్ ఒక్క అడుగు ముందే ఉంటుందని వెల్లడించారు.
ఇమ్రాన్ఖాన్కు అణుయుద్ధంపై అవగాహన లేదు
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అణుయుద్ద వ్యాఖ్యలపై స్పందించారు కొత్త అధిపతి. ఇమ్రాన్ ఖాన్కు అణుయుద్ధంపై అవగాహన లేదన్నారు. భారత్కు తమ సామర్థ్యంపై పూర్తి అవగాహన ఉందని సొంత విశ్లేషణ ఉందని చెప్పారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆర్కే భౌదరియా ఇండియన్ ఎయిర్ఫోర్స్లో 1980 జూన్లో చేరారు. తనకు 39 ఏళ్ల అనుభవం ఉంది.
పదవీవిరమణ చేసిన ధనోవా
మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఉన్న బీఎస్ ధనోవా పదవీవిరమణ చేశారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద ఆయన నివాళులు అర్పించారు. దాదాపు 41 ఏళ్ల పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సేవలందించారు బీఎస్ ధనోవా. 1978లో ఫైటర్ పైలట్గా ఆయన కెరీర్ను ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ప్రారంభించారు.