రూ. కోట్లు పంచారు: ఆర్కేనగర్ ఉప ఎన్నిక రద్దు చేస్తూ ఈసీ సంచలనం
అవినీతి ఆరోపణలు, విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ నేపథ్యంలో ఆర్ర్కే నగర్ నియోజకవర్గానికి బుధవారం నిర్వహించాల్సిన ఉప ఎన్నికను ఎన్నికల సంఘం రద్దు చేసింది. అన్నాడీఎంకేలోని శశికళ వర్గం..
చెన్నై: అవినీతి ఆరోపణలు, విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ నేపథ్యంలో ఆర్ర్కే నగర్ నియోజకవర్గానికి బుధవారం నిర్వహించాల్సిన ఉప ఎన్నికను ఎన్నికల సంఘం రద్దు చేసింది. అన్నాడీఎంకేలోని శశికళ వర్గం.. తమ అభ్యర్థి టిటివి దినకరన్కు ఓట్లు వేయాల్సిందిగా ఓటర్లకు రూ.89 కోట్లు పంచినట్లు ఆదాయపు పన్ను విభాగం అధికారులు ఆధారాలు బయటపెట్టిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆదాయపు పన్ను విభాగం శుక్రవారం 35కు పైగా ప్రదేశాల్లో సోదాలు చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఆరోగ్యశాఖ మంత్రి సి విజయభాస్కర్ నివాసంలో స్వాధీనం చేసుకున్న ఒక పత్రంలో ఓటర్ల కొనుగోలుకు అనుసరించాల్సిన వ్యూహం ఉన్నట్లు ఆదాయపుపన్ను విభాగం అధికారులు తెలిపారు.
ఆ పత్రం ప్రకారం నియోజకవర్గాన్ని 256 భాగాలుగా విభజించారు. నియోజకవర్గంలోని 2.6లక్షల ఓటర్లలో 85శాతం ఓటర్లకు చేరువ కావాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి ఓటరుకూ రూ.4వేల చొప్పున పంచాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి పళనిస్వామి, అటవీశాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాసన్, ఆర్థికమంత్రి జయకుమార్ సహా ఏడుగురు సీనియర్ నేతలకు లక్ష్యాలను విధించినట్లు అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల్లో వెల్లడికావడం గమనార్హం. 33వేల మంది ఓటర్లకు రూ.13.27కోట్లు పంచాలని ముఖ్యమంత్రికి లక్ష్యంగా నిర్దేశించారని పత్రాల్లో పేర్కొనడం జరిగింది. కాగా, ఈ ఆరోపణలను అధికార పార్టీ నేతలు, శశికళ వర్గం తోసిపుచ్చింది. ప్రస్తుతం రద్దయిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక జూన్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.