జయలలిత సమాధి వద్దకు విశాల్: సానుభూతి వ్యూహం! క్యూలో షాకిచ్చిన ఇండిపెండెంట్లు
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో నటుడు విశాల్ పోటీ చేస్తున్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు.
విశాల్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నప్పటికీ దివంగత జయలలిత సానుభూతిపరుల ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేయడానికి ముందు జయలలిత సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. దీపా జయకుమార్ కూడా నామినేషన్ వేశారు.
జయలలితతో పాటు వీరికీ నివాళులు
కేవలం జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించడమే కాదు, మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, కామరాజు, ఎంజీఆర్లకు కూడా విశాల్ శ్రద్ధాంజలి ఘటించారు. దీంతో విశాల్ పోటీ వెనుక అన్నాడీఎంకేలోని ఓ వర్గం హస్తం ఉండి ఉండవచ్చునని కొన్ని పార్టీలు అనుమానిస్తున్నాయి.
రాజకీయ వ్యూహం లేదని విశాల్ వర్గం
ఈ వాదనను విశాల్ మద్దతుదారులు మాత్రం కాదని చెబుతున్నారు. తమిళనాడు రాష్ట్రానికి సేవల చేసిన నాయకుల ఆశీర్వాదం కోసం మాత్రమే అతను వెళ్లాడని, అందులో ఎలాంటి తప్పు లేదా, ఎలాంటి రాజకీయ కోణం దాగి లేదని చెబుతున్నారు.
విశాల్కు షాకిచ్చిన ఇతర ఇండిపెండెంట్లు
కాగా, విశాల్ నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల అధికారి వేలుసామితో వాగ్వాదానికి దిగారని తెలుస్తోంది. విశాల్ విఐపీ కాబట్టి ఆయన నామినేషన్ను నేరుగా తీసుకోవద్దని, ఆయనను కూడా క్యూలో నిలబెట్టాలని ఎన్నికల అధికారితో వాగ్వాదానికి దిగారని తెలుస్తోంది. తమతో పాటు ఆయన కూడా నామినేషన్ వేసేందుకు క్యూలో నిలబడాల్సిందేనని చెప్పారు.
ఇటీవల యాక్టివ్గా విశాల్
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు విశాల్ రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. విశాల్ ఇప్పటికే సినీ రంగంలోని అవినీతిని ప్రశ్నిస్తున్నారు. తనకు తోచిన సాయం చేస్తున్నారు. మెర్సెల్ సినిమా వివాదం సమయంలోను బీజేపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.