అన్నాడీఎంకేలో కుదుపు! దినకరన్ గెలుపుతో తమిళనాట మారుతున్న రాజకీయం
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో చిన్నమ్మ వర్గం అభ్యర్థి దినకరన్ ఘన విజయం సాధించారు. దీంతో శశికళ వర్గం సంబరాలు చేసుకుంటోంది. మరోవైపు ఈ గెలుపుతో తమిళ రాజకీయాలు మారుతున్నాయి. అన్నాడీఎంకేలో పలువురు నేతలు శశికళకు జై కొడుతున్నారు.
ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు ముందు జయలలితకు చెందిన వీడియోను దినకరన్ వర్గం ఎమ్మెల్యే వేట్రివేల్ విడుదల చేశారు. ఈ ప్రభావం కూడా చూపినట్లుగా ఉంది. ఏది ఏమైనా ఈ గెలుపుతో తమిళనాట, ముఖ్యంగా అన్నాడీఎంకేలో కుదుపు వచ్చేలా కనిపిస్తోంది.
మారుతున్న తమిళ రాజకీయం
దినకరన్ గెలుపుతో అన్నాడీఎంకేలో కుదుపు తప్పనిసరి అని చాలామంది భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రి సెల్లూరు రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దినకరన్కతో కలిసి అన్నాడీఎంకే పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఆ తర్వాత పార్టీ ఎంపీ సెంగుట్టువన్. దినకరన్ నివాసానికి చేరుకున్నారు.
దినకరన్ ఇంటికి సెంగుట్టువన్
ఎంపీ సెంగుట్టువన్ ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం నాయకుడు. ఆయన కూడా దినకరన్ గెలుపు అనంతరం టీటీవీ ఇంటికి చేరుకోవడం గమనార్హం. దినకరన్కు 18 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. పన్నీరుసెల్వం - పళనిస్వామిల వర్గాల నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు మరికొందరు దినకరన్ వైపు వస్తారని భావిస్తున్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని డిమాండ్
టీటీవీ దినకరన్ గెలిచిన అనంతరం ఆయన వర్గీయులు ఇంటివద్ద, పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున గుమికూడారు. అమ్మ జయలలితకు అసలు వారసుడు శశికళ, దినకరన్లు అని నినదించారు. దినకరన్కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.
ఒక్క తమిళనాడులోనే రివర్స్
ఆర్కే నగర్తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని ఐదు స్థానాలకు ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. బెంగాల్లోని సబంగ్లో టీఎంసి, అరుణాల్ ప్రదేశ్లోని రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు, యూపీలోని సికంద్రలో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఒక్క తమిళనాడులోనే తారుమారైంది. ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థి కాకుండా స్వతంత్ర అభ్యర్థి దినకరన్ గెలిచారు.