జయ వారసుడ్ని, మూణ్ణెళ్లు వెయిట్&సీ: దినకరన్, బీజేపీ రికార్డ్ అంటూ సుబ్రహ్మణ్యస్వామి ఎద్దేవా
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు దిశగా సాగుతున్న స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్ వర్గీయులు ఆయన ఇంటి ఎదుట, ఓట్లు లెక్కిస్తున్న కేంద్రం వద్ద సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు, ఈ ఫలితాలతో జయలలిత అసలు వారసులు ఎవరో తేలిపోయిందని చెబుతున్నారు.
Recommended Video
చదవండి: ఆర్కే నగర్ ఎన్నికల ఫలితాలు
అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను వెంటనే శశికళ - దినకరన్లకు అప్పగించాలని ఆ వర్గీయులు డిమాండ్ చేశారు. ప్రజల మద్దతు చిన్నమ్మకు ఉందని తేలిపోయిందని అంటున్నారు. కాగా ఆర్కే నగర్లో దినకరన్ భారీ ఆధిక్యంతో విజయం సాధించనున్నట్లుగా ఫలితాల సరళిని బట్టి తెలుస్తోన్న విషయం తెలిసిందే.
ఆర్కే నగర్ తీర్పే తమిళ ప్రజల తీర్పు
ఆర్కే నగర్ తీర్పే తమిళ ప్రజల తీర్పు అని దినకరన్ వ్యాఖ్యానించారు. ఆయన మధురై విమానాశ్రయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో మూడు నెలల్లో పళని ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు. మూణ్ణెళ్లు వెయిట్ అండ్ సీ అన్నారు. పార్టీ గుర్తు ముఖ్యం కాదని, పోటీ చేసే వ్యక్తి ముఖ్యమని ఆయన తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎవరు కూడా పార్టీ గుర్తును చూసి ఓటు వేయలేదన్నారు.
గాల్లోకి లేచిన కుర్చీలు
అంతకుముందు, ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పలుమార్లు ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. లెక్కింపుపై అసంతృప్తి వ్యక్తం చేసిన అన్నాడీఎంకే వర్గాలు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు చక్కెర్లు కొడుతున్నాయి. అన్నాడీఎంకే ఏజెంట్లు, దినకరన్ ఏజెంట్లు గొడవపడ్డారు. అధికారులపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. కాగా, వీడియోలో కుర్చీలు గాల్లోకి లేచిన దృశ్యాలు అందరినీ షాక్కు గురి చేసాయి.
ఆర్కే నగర్ ఉప ఎన్నికపై సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్
ఆర్కే నగర్ ఉప ఎన్నికపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. తమిళనాడు బీజేపీ రికార్డ్ అంటూ దేశాన్ని పాలిస్తున్న ఓ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. కాగా, దినకరన్ గెలుస్తాడని తాను ముందే చెప్పానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే రెండు గ్రూపులు 2019 లోకసభ ఎన్నికల నాటికి ఒక్కటవుతాయని జోస్యం చెప్పారు.
మధ్యాహ్నం జయ సమాధి వద్దకు దినకరన్
దినకరన్ మధ్యాహ్నం మూడు గంటలకు దివంగత జయలలిత సమాధి వద్దకు వెళ్లనున్నారు. ఆమ్మ వారసుడిగా ఆర్కే నగర్ తనను గుర్తించిందని ఆయన వ్యాఖ్యానించారు. తనకు అండగా నిలబడ్డ కోటిన్నర మంది కార్యకర్తలకు థ్యాంక్స్ తెలిపారు.