టీటీవీ దినకరన్ సంచలన నిర్ణయం: ఎంజీఆర్ పుట్టినరోజు: శశికళ ఫ్యామిలీ కొత్త పార్టీ!
Recommended Video
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చిన్నమ్మ శశికళ కుటుంబ సభ్యులు కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మంగళవారం పుదుచ్చేరిలో తన మద్దతుదారులతో టీటీవీ దినకరన్ మంతనాలు జరపడనానికి వెళ్లారు. ఎంజీఆర్ పుట్టిన రోజు సందర్బంగా బుధవారం టీటీవీ దినకరన్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని వెలుగు చూసింది.
డేట్ ఫిక్స్ చేశారు
అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ (ఎంజీ. రామచంద్రన్) జయంతి వేడుకల నేపథ్యంలో బుధవారం టీటీవీ దినకరన్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేస్తారని ఆయన మద్దతుదారులు అంటున్నారు.
చుక్కలు చూపించిన దినకరన్
జయలలిత ప్రాతినిథ్యం వహించి ఆమె మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్ స్వతంత్ర్య పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ, ప్రతిపక్షం డీఎంకే పార్టీకి టీటీవీ దినకరన్ చుక్కలు చూపించారు.
మూడు నెలల్లో ప్రభుత్వం !
మార్చి నెల చివరికి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం కూలిపోతుందని, అన్నాడీఎంకే పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు రావాలని టీటీవీ దినకరన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే టీటీవీ దినకరన్ తన మద్దతుదారులతో పుదుచ్చేరిలో సమావేశం అవుతున్నారు.
పార్టీ మీద పట్టు
వీకే శశికళ నటరాజన్ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లిన తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలిసిపోయి అన్నాడీఎంకే పార్టీపై పట్టుసాధించిన విషయం తెలిసిందే.
టీటీవీ దినకరన్ కొత్త ప్లాన్
పన్నీర్ సెల్వం డిమాండ్ మేరకు చిన్నమ్మ శశికళ నటరాజన్, టీటీవీ దినకరన్ తో సహా వారి వర్గంపై వేటు వేసి పార్టీ నుంచి బహిష్కరించారు. అన్నాడీఎంకే పార్టీలో సభ్యత్వం, రెండాకుల చిహ్నం కూడా కోల్పోయిన నేపథ్యంలోనే టీటీవీ దినకరన్ కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచన చేశారని వెలుగు చూసింది.
మూడు నెలల్లో ఎన్నికలు !
పుదుచ్చేరి నగరం శివార్లలోని రిసార్టులో టీటీవీ దినకరన్ తన మద్దతుదారులు, అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి చర్చించడానికి సిద్దం అయ్యారు. మూడు నెలల్లో తమిళనాడులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీటీవీ దినకరన్ వర్గం పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యింది.
ఒకే చిహ్నం కావాలి !
గతంలో అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్టు ఇప్పుడు టీటీవీ దినకరన్ కొత్త రాజకీయ పార్టీకి వేదిక అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గం అభ్యర్థులు పోటీ చేసే సమయంలో అందరికీ ఒకే చిహ్నం ఉండాలని టీటీవీ దినకరన్ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారు.