ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు, 59 మంది పోటీ, హీరో విశాల్ చివరికి, చాన్స్ ఇచ్చినా !
చెన్నై: జయలలిత ప్రానిధ్యం వహించిన చెన్నైలోని ఆర్ కే నగర్ (రాధక్రిష్ణన్ నగర్) ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ప్రముఖ నటుడు, తమిళ సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ కు అవకాశం లేకపోయింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల బరిలో ఓ మహిళతో పాటు మొత్తం 59 మంది అభ్యర్థులు ఉన్నారు.
నామినేషన్ పత్రాలలో ఇద్దరి సంతకాలు ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ విశాల్ నామినేషన్ పత్రాలను ఎన్నికల కమిషన్ అధికారులు తిరస్కరించారు. అయితే గురువారం మద్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ పత్రాల్లో సంతకాలు చేసిన ఇద్దరినీ హాజరుపరచాలని ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చినా విశాల్ కు అది సాధ్యం కాలేదు.
విశాల్ కు అవకాశం ఇచ్చినా దానిని ఆయన సద్వినియెగం చేసుకోలేదంటూ ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించిన ఎన్నికల కమిషన్ అధికారులు ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తుది జాబితాను గురువారం సాయంత్రం విడుదల చేశారు.
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ, బీఎస్పీతోపాటు అనేక ద్రవిడ పార్టీల నాయకులు బరిలో నిలిచారు. మొత్తం 145 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. 72 మంది అభ్యర్థుల నామినేషన్లు అధికారులు అమోదించారు. 73 నామినేషన్లు తిరస్కరించారు.
గురువారం 13 మంది తమ నామినేషన్ పత్రాలను వెనక్కి(విత్ డ్రా) తీసుకున్నారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలతో సహ 47 మంది స్వతంత్ర పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నామినేషన్లు తిరస్కరించిన వారిలో హీరో విశాల్ తో పాటు జయలలిత మేనకోడలు దీపా ఉండం కొసమెరుపు.