పళనిస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి: సిఎంకు ఈసీ షాక్
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై ఎఫ్ఐఅర్ నమోదు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈసీ పైవిధంగా స్పందించింది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై ఎఫ్ఐఅర్ నమోదు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈసీ పైవిధంగా స్పందించింది.
తద్వారా, ఆర్కే నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచిన ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురిపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, అన్నాడీఎంకే (అమ్మ) డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్, ఆరోగ్య మంత్రి సి విజయ్భాస్కర్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.
ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లకు డబ్బులు పంచారంటూ వెలుగు చూసిన వీడియో సంచలనమైంది. దీనిపై సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈసీ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలిచ్చింది.
ఓటర్లకు పెద్దఎత్తున డబ్బులు పంచడంపై పెద్దఎత్తున దుమారం రేగడంతో ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఈసీ నిలిపివేసింది. ఎన్నికల తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. ఈసీ నిర్ణయానికి ముందు ఆదాయం పన్ను అధికారులు చెన్నైలో మంత్రి సి విజయ్భాస్కర్ నివాసాలపై పెద్దఎత్తున దాడులు జరిపారు.
ఆర్కే నగర్ అభ్యర్థి టీటీవీ దినకరన్ గెలుపుకోసం ఓటర్లను రూ.90 కోట్లకు పైగా డబ్బులు పంచారని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు నివేదిక సమర్పించడంతో ఎన్నికల సంఘ ఉప ఎన్నికను నిలిపివేసింది.
అనంతరం అన్నాడీఎంకే శశికళ వర్గానికి రెండాకుల గుర్తు దక్కించేందుకు ఎన్నికల అధికారికి లంచం ఇవ్వచూపారనే ఆరోపణలపై టీటీవీ దినకరన్ను గత ఏప్రిల్ 26న పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే ఆయన బెయిలుపై విడుదలయ్యారు.