ఒంటరిగానే ఆర్ ఎల్ డి పోటీ, యూపిలో పోటీకి దూరంగా జెడియూ, అఖిలేష్ కు కలిసివచ్చేనా?
కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలతో కలిసి ఆర్ ఎల్ డి కూడ పొత్తు ఉంటుందని భావించినా, చివరి నిమిషంలో ఆర్ ఎల్ డి ఒంటరిగానే పోటీచేస్తోంది.మరో వైపు ఉత్తర్ ప్రదేశ్ లో తాము పోటీచేయడం లేదని జెడియూ ప్రకటించింది.
లక్నో:కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలతో కలిసి ఆర్ ఎల్ డి కూడ పొత్తు ఉంటుందని భావించినా, చివరి నిమిషంలో ఆర్ ఎల్ డి ఒంటరిగానే పోటీచేస్తోంది.మరో వైపు ఉత్తర్ ప్రదేశ్ లో తాము పోటీచేయడం లేదని జెడియూ ప్రకటించింది. ఏ పార్టీకి కూడ మద్దతివ్వబోమని ఆ పార్టీ ప్రకటించింది.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో 403 స్థానాలున్నాయి. అయితే సమాజ్ వాదీ పార్టీ 298 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 105 స్థానాల్లో పోటీచేస్తోంది.
కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల కూటమిలో ఆర్ ఎల్ డి చేరాలని భావించింది.అయితే ఆర్ ఎల్ డి ఎక్కువ సీట్లను డిమాండ్ చేయడంతో సమాజ్ వాదీ పార్టీ ఆర్ ఎల్ డి ని తమ కూటమిలో చేర్చుకోలేదు.
తాము అనుకొన్న సీట్ల కంటే ఎక్కువ సీట్లను కాంగ్రెస్ పార్టీకి కేటాయించాల్సిన పరిస్థితి సమాజ్ వాదీ పార్టీకి అనివార్యంగా నెలకొంది. సీట్ల కేటాయింపు సమస్య కారణంగానే ఒకానొక దశలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కూడ ఉండదనే ప్రచారం కూడ సాగింది. సోనియా, ప్రియాంకలు రంగంలోకి దిగడంతో పొత్తు కుదిరింది.
ఒంటరిగానే ఆర్ ఎల్ డి అన్ని స్థానాలకు పోటీ
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీల కూటమిలో చేరాలని భావించిన ఆర్ ఎల్ డి కి ఎదురుదెబ్బతగిలింది. ఆర్ ఎల్ డి ఎక్కువ సీట్లను డిమాండ్ చేయడంతో అన్నిసీట్లను ఇచ్చే పరిస్థితులో లేని సమాజ్ వాదీ పార్టీ ఆ పార్టీతో పొత్తు లేదని ప్రకటించింది. దరిమిలా ఆర్ ఎల్ డి ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతోంది.ఒంటరిగానే అన్ని స్థానాలకు పోటీచేస్తోంది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను ఆర్ ఎల్ డి ప్రకటించింది.
ఏడు జాబితాలను ప్రకటించిన ఆర్ఎల్ డి
సమాజ్ వాదీ పార్టీతో పొత్తు కుదరకపోవడంతో అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్ ఎల్ డి స్వతంత్రంగానే బరిలోకి దిగుతోంది. ఆర్ ఎల్ డి ఏడు జాబితాలను ఇప్పటివరకు విడుదలచేసింది. 403 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటివరకు 131 అసెంబ్లీ స్థానాలకు ఆర్ ఎల్ డి అభ్యర్థులను ప్రకటించింది. గతంలో ప్రకటించిన అభ్యర్థుల్లో మార్పులు చేర్పులను కూడ ఆ పార్టీ చేసింది. తిహర్ సీటును తొలుత అబ్దుల్ ఖదీర్ కు కేటాయించారు. అయితే ఈ స్థానం నుండి ప్రదీప్ కుమార్ కు కేటాయించారు.
అజిత్ సింగ్ ఎక్కడి నుండి పోటీచేస్తారో
ఆర్ ఎల్ డి ఛీప్ అజిత్ సింగ్ ఎక్కడి నుండి పోటీచేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గోవింద్ నగర్, పట్టి,కరోన్, శివ్ పూర్, కైమ్ గంజ్ నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుండి అజిత్ సింగ్ పోటీచేస్తారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.గత ఎన్నికల్లో ఆర్ ఎల్ డి 40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. ఇందులో 9 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. 20 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు అసలు డిపాజిట్లు దక్కలేదు.
పోటీకి (జెడియూ) దూరం
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాముపోటీ చేయడం లేదని జనతాదళ్( యునైటెడ్) ప్రకటించింది.జెడియూతో సహ ఇతర పార్టీలను కలుపుకొని యూపి ఎన్నికల్లో పోటీచేస్తామని ఆర్ ఎల్ డి నేత అజిత్ సింగ్ ప్రకటించారు.అయితే ఈ ప్రకటన వెలువడిన మీదట ఈ ఎన్నికల్లో తాము పోటీచేయడం లేదని జెడియూ ప్రకటించింది.ఈ మేరకు జెడియూ అధికార ప్రతినిధి త్యాగి ఈ విషయాన్ని మీడియాకు వివరించారు.
ఓట్లను చీల్చడం ఇష్టం లేకనే పోటీకి దూరం
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీచేయడం ద్వారా లౌకిక ఓట్లు చీలే అవకాశం ఉందని జెడియూ భావిస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది.సమాజ్ వాదీ పార్టీతో జెడియూ పొత్తు పెట్టుకొంటోందని తొలుత వార్తలు వచ్చాయి.అయితే ఈ విషయమై జెడియూ స్పష్టత ఇచ్చింది.గత ఎన్నికల్లో నితీష్ కుమార్ విస్తృతంగా ప్రచారం కూడ నిర్వహించారు.అయితే ఈ దఫా ఎక్కడ కూడ ప్రచారసభల్లో నితీష్ పాల్గొనడం లేదు.