రోడ్డుప్రమాదంలో ఐపీఎస్ అధికారి తల్లిదండ్రులు దుర్మరణం: అనుమానాలెన్నో!
లక్నోః ఉత్తర్ ప్రదేశ్ రక్తమోడింది. యమునా ఎక్స్ప్రెస్ వే సహా ఆ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 20 మంది దుర్మరణం పాలయ్యారు. 12 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఐపీఎస్ అధికారి తల్లిదండ్రులు ఉన్నారు. 10 గంటల వ్యవధిలోనే ఈ వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. యమునా ఎక్స్ప్రెస్ వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుమంది సంఘటనాస్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. మథుర సమీపంలో యమునా ఎక్స్ప్రెస్ వే పై ఆగ్రా వైపునకు అతి వేగంగా వెళ్తున్న అంబులెన్స్ అదుపు తప్పింది.
డివైడర్ ను ఢీ కొట్టి సుమార పది అడుగుల మేర గాల్లోకి లేచింది. అటు వైపు నుంచి ఎదురుగా వస్తోన్న మరో కారును ఢీ కొట్టింది. దీనితో కారులో ప్రయాణిస్తున్న అయిదుమంది, అంబులెన్స్ లో ఉన్న ఇద్దరు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో అంబులెన్స్లోని ఉన్న నలుగురు ఓ మృతదేహాన్ని తీసుకుని వెళ్తున్నట్లు స్పష్టమైంది. మరి కొందరు గాయపడ్డారు. బులంద్ షహర్ లో చోటు చేసుకున్న మరో రోడ్డు ప్రమాదంలో అయిదుమంది జల సమాధి అయ్యారు. మొరాదాబాద్ నుంచి వృందావన్కు వెళ్తే భక్తులతో కూడిన వాహనం సూరజ్ పూర్ సమీపంలో రోడ్డు పక్కన ఓ చెరువులో దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో అయిదుమంది జల సమాధి అయ్యారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. కాన్పూర్ జిల్లాలోని ఘాతమ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో అయిదుమంది మరణించారు. కారు డ్రైవర్ మినహా మిగిలిన వారందరూ ఐపీఎస్ అధికారి కుటుంబ సభ్యులు. ఐపీఎస్ అధికారి అరవింద్ ఆనంద్ తల్లిదండ్రులు రజనీ, దినేష్ రజక్, చెల్లెలు అంకిత, బావ మరిది దేవేంద్ర ఉన్నారు. పశ్చిమబెంగాల్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి అరవింద్ ఆనంద్ డెప్యుటేషన్పై కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు.
ఉత్తర్ప్రదేశ్ లోని రాయ్బరేలీలో ఓ వివాహానికి హాజరైన ఆయన కుటుంబం కారులో మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ కు తిరిగి వెళ్తుండగా.. ఘాతమ్పూర్ వద్ద ఎదురుగా వచ్చిన ఓ లారీ ఢీ కొట్టింది. దీనితో కారులో ప్రయాణిస్తున్న వారందరూ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఉద్దేశపూరకంగానే ఈ ప్రమాదాన్ని సృష్టించి ఉండవచ్చని తెలుస్తోంది.