రోడ్ టెర్రర్: మణిపూర్ మధ్యప్రదేశ్లలో ఘోర రోడ్డు ప్రమాదాలు..
ప్రమాదంలో 12మంది మృతి చెందగా, మరో 30 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
భోపాల్: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జబల్ పూర్ లోని నీచీ అనే గ్రామంలో మినీ ట్రక్కు బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 12మంది మృతి చెందగా, మరో 30 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
ప్రమాద ఘటన గురించి తెలియగానే పోలీసులు, సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. క్షతగాత్రులంతా రైతు కూలీలే అని సమాచారం. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మణిపూర్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం:
మణిపూర్ లోని సేనాపతి జిల్లాలో ఓ బస్సు లోయలో పడిపోయింది. ప్రమాదంలో 8మంది ప్రయాణికులు మరణించగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. సోమవారం తెల్లవారుజామున 3గం.కు ఈ ఘటన చోటు చేసుకుంది. మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు 90కిమీ దూరంలో.. మారం-మకాన్ మార్గం గుండా బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది.
ప్రమాదంలో చాలామంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రభుత్వం తరుపు నుంచి వీలైనంత సహాయక చర్యలను చేపడుతున్నట్లుగా వివరించారు.