శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్: కుదిరిన సయోధ్య, కామన్ మినిమం ప్రొగ్రామ్ డ్రాప్ట్ రెడీ
వైరిపక్షాలు శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ మధ్య సయోధ్య కుదిరింది. ప్రభుత్వ ఏర్పాటుపై మూడు పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. కనీస ఉమ్మడి ప్రణాళిక నివేదికను రూపొందించుకున్నాయి. ఆ మేరకు కలిసి పనిచేస్తామని స్పష్టంచేశాయి. దీనికి మూడు పార్టీల అధినేతల ఆమోదం పడిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. గవర్నర్ వద్దకెళ్లి ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానం పలుకాలని కోరతారు.
48 గంటల తర్వాత..
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించి 48 గంటలు ముగిసినా తర్వాత పార్టీల్లో చర్చలు కొలిక్కి వచ్చాయి. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య పొత్తుపై ప్రతిష్టంభన వీడింది. ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు మూడు పార్టీలు సుముఖత వ్యక్తం చేశాయి. కనీస ఉమ్మడి ప్రణాళికను రూపొందించి.. ఆ మేరకు పనిచేస్తామని తెలిపాయి.
ఇవీ అంశాలు
కనీస ఉమ్మడి ప్రణాళికలో రైతుల రుణమాఫీ, రైతులకు పంట బీమాపై సమీక్ష, నిరుద్యోగం, పంటకు కనీస మద్దతు ధర, ఛత్రపతి శివాజీ మహరాజ్, బీఆర్ అంబేద్కర్ స్మారక చిహ్నాలు ఏర్పాటు గురించి ఉన్నాయి. దీనికి సంబంధించి మూడు పార్టీలు కలిసి డ్రాప్ట్ రూపొందించాయి. దీనికి మూడు పార్టీ అధినేతలు ఆమోదం తెలుపడంతో పొత్తుపై స్పష్టత వస్తోంది.
ఆమోదమే తరువాయి
కనీస ఉమ్మడి ప్రణాళికకు అధినేతల ఆమోదం పడ్డ తరువాత.. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ సాగుతుంది. మూడు పార్టీల నేతలు కలిసి గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలుస్తారు. తమకు 155 మంది సభ్యులు మద్దతు ఉందని లేఖను అందజేస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పిలువాలని కోరతారు. గవర్నర్ ఆహ్వానం మేరకు మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరనుంది.
బీజేపీ ఏం చేస్తుందో..
అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ ఏం చేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కర్ణాటకలో కూడా బీజేపీ ఏడాదిన్నర పాటు స్తబ్ధుగా ఉండి.. తర్వాత తిరుగుబాటు వేయించిన సంగతి తెలిసిందే. ఒకవేళ శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పడితే కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.